శ్రీకాకుళం పాతబస్టాండ్/శ్రీకాకుళం కల్చరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధ్యాత్మికతతో అనుసంధానం చేసి వినాయక ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. నగరంలోని రైతు బజార్ జంక్షన్లో ఇలిసిపురం మెగా యూత్ కమిటీ చైర్మన్ హారిక ప్రసాద్ ఆహ్వానం మేరకు ఆదివారం కుటుంబ సమేతంగా వినాయక మండపాన్ని సందర్శించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి రూపంలో దర్శనమిస్తున్న వినాయకుడిని దర్శించుకున్నారు. 25 అడుగుల భారీ విగ్రహాన్ని పూర్తిగా సహజ మట్టితో రూపొందించి పర్యావరణ పరిరక్షణకు గొప్ప సందేశమివ్వడం పట్ల కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. కాణిపాకం వినాయకుడి నమూనాను బావి నుంచి పైకి, కిందకు కదిలేలా రూపొందించిన వినూత్న సాంకేతికతను ప్రశంసించారు. ఉత్తరాంధ్రలోనే తొలిసారిగా హోలోగ్రామ్ సాంకేతికత ద్వారా ప్రదర్శించిన శివతాండవం, మహాగణపతి నత్య ప్రదర్శనలు వీక్షించిన ఆయన, ఇలాంటి ఆవిష్కరణలను జిల్లాలో అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమని కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ హారిక ప్రసాద్, నీహర్, ఇలిసిపురం మెగా యూత్ సభ్యులు వాసు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


