● స్వగ్రామంలో రూ. 30 లక్షలతో అభివృద్ధి పనులు
● కోమర్తిలో స్కూల్, అశిరమ్మ అమ్మవారి గుడి, పెద్ద చెరువు అభివృద్ధి
● విశాఖకు చెందిన వైశ్యరాజు జ్యుయలర్స్ యజమాని ఫల్గుణరావు ఔదార్యం
నరసన్నపేట: పుట్టిన ఊరి రుణం ఫల్గుణరాజు తీర్చుకున్నారు. ఏకంగా రూ. 30 లక్షలు వెచ్చించి మండలంలోని కోమర్తిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. 30 ఏళ్ల కిందట కోమర్తి నుంచి విశాఖ వెళ్లిన ఫల్గుణరాజు వైశ్యరాజు జ్యుయలర్స్ పేరున బంగారం షాపులు పెట్టి ఉన్నత స్థాయికి చేరారు. అయితే తాను చదువుకున్న స్కూల్, వినియోగించిన చెరువు, పూజించిన అమ్మవారి గుడి శిథిలావస్థలో ఉన్నాయని తెలుసుకొని పెద్ద మనసుతో వీటి అభివృద్ధికి కంకణం కట్టారు. ఇప్పుడు చెరువు అభివృద్ధి జరిగింది. స్కూల్ రూపు రేఖలు మారాయి. అశిరమ్మ తల్లి మంటపం సుందరంగా తయారైంది. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తనకు చదువు చెప్పిన కొల్లి ఇల్లయ్య మాస్టారు విగ్రహాన్ని కూడా స్కూల్లో ఏర్పాటు చేశారు.
స్కూల్లో చేపట్టిన అభివృద్ధి పనులు
డైనింగ్ హాల్, పార్క్, క్లాస్ రూం, ప్లే గ్రౌండ్, ఫుట్పాత్కు వాకింగ్ టైల్స్, ప్లాంటేషన్, చదువు చెప్పిన గురువు విగ్రహం, ప్రహరీ నిర్మాణం చేప ట్టారు. అలాగే క్లాస్ రూమ్స్లో ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ప్లే గ్రౌండ్కు అవసరమైన ఆట పరికరాలు, విద్యార్థులకు ఐడీ కార్డులు, మినరల్ వాటర్ ప్లాంట్, కిచెన్కు టైల్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. అలాగే చెరువు మెట్లు నిర్మాణం, సుందరీకరణ, చెరువుకు ఆనుకొని ఉన్న కాలువను అభివృద్ధి చేశారు. చెరువు వద్ద షెడ్ కూడా పునర్నిర్మించారు. బీసీ కాలనీ వద్ద అశిరమ్మ అమ్మవారి గుడిని అభివృద్ధి చేశారు. చుట్టూ స్టీల్ గ్రిల్స్, ఫ్లోరింగ్, గోడల ఎత్తు పెంచారు. అలాగే స్కూల్తో పాటు అమ్మవారి గుడికి రంగులు వేయించారు. ఆదివారం ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ నాటికి నా ఊరికి సేవ చేసే అవకాశం వచ్చింది. నా కుమారులు నరేష్, కిరణ్, గిరి భార్య భారతి ఎంతగానో సహకరించారు.
– వైశ్యరాజు ఫల్గుణరాజు


