శ్రీకాకుళం (పీఎన్కాలనీ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పడం కేవలం ఓట్ల కోసమేనని, అదంతా బూటకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ విమర్శించారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతిభవన్లో ఆదివారం సీపీఐ జిల్లా కార్యవర్గ, సమితి సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు చాపర సుందర్లాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ బీసీ ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చంద్రబాబు డ్రామాడుతున్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చిందని, అలాంటప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీ అమలయ్యే పరిస్థితే లేదన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు తాండవిస్తోందని, ఇప్పటికే 513 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు ప్రభుత్వ అధికారులే ధ్రువీకరించారని, ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ భారాన్ని మోపడమే కాకుండా, ఇప్పుడు కొత్తగా యూపీఐ లావాదేవీలపై కూడా చార్జీలు విధించి ప్రజలను నిలువునా దోచుకునేందుకు చూస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ‘మార్పు రావాలి – మార్పు కావాలి’ అని ఢిల్లీలో సీపీఐ చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష మద్దతు లభించిందన్నారు. అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో జిల్లా స్థాయి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జిల్లా కార్యవర్గ, సమితి సభ్యులు పాల్గొన్నారు.


