● అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు
సోంపేట : మండలంలో ఆగస్టు, సెప్టెంబరు నెల ప్రథమార్థం వర్షాలు కురవలేదు. ప్రస్తుతం కురుస్తున్న అడపాదడపా వర్షాలకు కొన్ని చోట్ల రైతులు నాట్లు వేస్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో డీఏపీ, యూరియా ఆశించిన స్థాయిలో సరఫరా కాకపోవడంతో రైతులు ఎరువుల దుకాణదారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా జింకిభద్ర రహదారిపై రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణం యజమాని రైతులకు అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడ్డాడు. భారత్ ఎన్పీకే గ్రోమోర్ రూ.750 విలువైన ప్యాకెట్ను రైతులకు రూ.1200కు విక్రయిస్తున్నారు. శుక్రవారం బెంకిలి గ్రామానికి చెందిన రైతులు మడ్డు కృష్ణారావు తదితరులు బస్తాపై అమ్మకపు ధర రూ.750 ఉంటే రూ.1200కు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. అనంతరం వ్యవసాయాధికారి బి.నర్సింహమూర్తికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన దుకాణానికి చేరుకుని ఎరువుల అమ్మకం నిలుపుదల చేశారు. ఇంత వరకు విక్రయించిన బిల్లుల వివరాలు అందజేయాలని యజమానిని ఆదేశించారు. రైతులు ఎరువుల అవసరాలను తమకు తెలియజేస్తే అందజేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో వ్యవసాయ సహాయకురాలు ఐశ్వర్య, తదితరులు పాల్గొన్నారు.


