శ్రీకాకుళం (పీఎన్కాలనీ):
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారం కోసం కార్యాచరణ చేపట్టనున్నట్లు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగభూషణం తెలిపారు. శ్రీకాకుళం నగరంలో క్రాంతి భవన్లో జిల్లా సమితి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగభూషణం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమశేఖర్, రవి మాట్లాడుతూ సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర సంక్షేమ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, హాస్టళ్లలోని వాస్తవ పరిస్థి తులను పరిశీలిస్తామని తెలిపారు. భోజనం నాణ్యత, మెస్ మెనూ అమలు, తాగునీరు, వసతి గదులు, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, పారిశుధ్యం, స్టడీ అవర్స్, పాఠ్యపుస్తకాలు, విద్యా సామగ్రి తదితర అంశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. తక్కువ మెస్ బిల్లుల కారణంగా విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై ప్రభావం పడకుండా ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలన్నారు.
అన్ని సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత సొంత భవనాలు నిర్మించి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, వంటశాల, భోజన శాల తదితర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కేవలం వసతి కల్పించడం మాత్రమే కాకుండా వారి చదువుకు అనుకూలమైన నాణ్యమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు హర్షవర్ధన్, గౌరీ, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.


