ఇచ్ఛాపురం: ప్రైవేటు పాఠశాలల సమస్యలు పరిష్కరించి బలోపేతం చేసేదిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రైవేటు పాఠశాలల గౌరవ అధ్యక్షుడు మెట్ట జనార్ధనరావు అన్నారు. పట్టణంలోని స్వర్ణభారతి ప్రైవేటు పాఠశాల ఆవరణలో ప్రైవేటు పాఠశాలల నియోజకవర్గ అధ్యక్షుడు చాట్ల తులసీదాస్ రెడ్డి అధ్యక్షతన ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సిబ్బందితో సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలన్నీ ఐక్యంగా ఉంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల పర్యవేక్షణకు ఒక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రత్యేక కార్యవర్గంలో సభ్యులుగా జోహార్ఖాన్, వాసుపట్నాయక్, కింగ్, పి.చిరంజీవి, పక్కి బాలకృష్ణ, కె.రామారావులు ఉన్నారు. కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల ఉత్తరాంధ్ర అధ్యక్షుడు గణపతిరావు, జిల్లా అధ్యక్షుడు అప్పలాచారి, ప్రతినిధులు కృష్ణమూర్తిరెడ్డి, వేణుగోపాలరావు, రవికుమార్, శ్రీరామమూర్తి, రమేష్, కన్నబాబు, చిన్న, ఆదినారాయణ, డి.తిరుపతి, భానుతేజ, మాధవరావు, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.


