● బొత్సపై చేసిన వ్యాఖ్యలను
అచ్చెన్నాయుడు వెనక్కి తీసుకోవాలి
● మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం
ఆమదాలవలస: శాసనమండలిలో వైఎస్సార్ సీపీ పక్ష నేత, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నా యకుడు బొత్స సత్యనారాయణపై రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమదాలవలసలో గురువారం ఆయన ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడిని శాసనమండలి వంటి గౌరవప్రదమైన వేదికపై అసభ్య పదజాలంతో సంబోధించడం అచ్చెన్నాయుడి అహంకారానికి, సంస్కారహీనతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. పాలన వైఫల్యాలపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని, శాసనసభా సంప్రదాయాలను అపహాస్యం చేయడమేనని విమర్శించారు.
శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై అచ్చెన్నాయుడు చేసిన కృషి ఏమిటో ప్రజలకు చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గంలో ఓ మహిళా రైతు ఎరువుల కోసం వచ్చి చనిపోతే కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించని మంత్రి, రాష్ట్రంలోని రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని నిలదీశారు. బీసీల సంక్షేమం, బీసీ రిజర్వేషన్లపై సభల్లో చర్చ జరుగుతున్న సమయంలోనే మరో బీసీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతను బహిరంగంగా దూషించడం సిగ్గుచేటని త మ్మినేని అన్నారు. ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కాపు సామాజికవర్గానికి జరుగుతు న్న అన్యాయాన్ని ఆ వర్గం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అచ్చెన్నాయుడికి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. అచ్చెన్నాయుడు తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బొత్స సత్యనారాయణకు,రాష్ట్ర బీసీ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు.


