శ్రీకాకుళం పాతబస్టాండ్: పాతపట్నంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో చింతల పూజ మృతి ఘటనపై జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరిపై దళిత సంఘాల ఫిర్యాదు మేరకు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలతో గురువారం ఆదివారంపేటలోని జిల్లా డీసీవో కార్యాలయంలో విచారణ నిర్వహించారు. విజయనగరం డీసీవో రూపవతి విచారణ అధికారిగా హాజరై దళిత సంఘాల ప్రతినిధుల నుంచి వివరాలు, అభ్యంతరాలు స్వీకరించారు. దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, ఉపాధ్యాయ–విద్యార్థి–దళిత–ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కష్ణయ్య, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా నాయకులు కానుకుర్తి గోవింద్, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు బైరి ధనరాజ్, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, అంబేద్కర్ విశ్వవిద్యాలయం అంబేడ్కర్ చైర్ సాధన సమితి జిల్లా కన్వీనర్ టి.రమణ హాజరయ్యారు. ప్రిన్సిపాల్తో పాటు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ పూర్తయ్యే వరకు వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.


