అరసవల్లి: సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజల సందడి కనిపించింది. శ్రవణ నక్షత్రం, దశమి తిథి, ఆదివారం కావడంతో ప్రత్యేక శుభయోగం కావడంతో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు బారులు తీరారు. ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనాలు జరిగేలా చర్యలు చేపట్టారు. ఎండ నుంచి ఉపశమన చర్యలతో పాటు ఉచిత మంచినీటిని పంపిణీ చేయించారు. అలాగే మరోవైపు ఇంద్రపుష్కరిణి అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా ఈశాన్య గేటు నుంచి దర్శనాలను నిలిపివేసి ప్రధాన సింహద్వారం నుంచే దర్శనాలకు అనుమతించారు. వీఐపీలతో పాటు సామాన్యులకు కూడా ఇదే మార్గంలో దర్శనాలకు పంపించడంతో పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. ఇక అంతరాలయం వద్ద దాతలకు రూ.300 టిక్కెట్టు దారులకు మాత్రమే అంతరాలయ దర్శనాలు చేయించేలా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ చర్యలు చేపట్టారు. ఆన్లైన్ దర్శనాల టిక్కెట్ల విక్రయాలన్నీ బ్యాంకు సిబ్బంది అలాగే ఆలయ రెగ్యులర్ ఉద్యోగులతో మాత్రమే విక్రయాలు జరిపిస్తున్నామని, గత కొంతకాలంగా ఇదే విధానం అమలవుతుందని ఆలయ ఈఓ ప్రసాద్ స్పష్టం చేశారు.
టార్పాలిన్లు సరిచేశారు..
సూర్య క్షేత్రంలో ఎండ తీవ్రత కారణంగా భక్తులు ఇబ్బంది పడేవారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నాశిరకపు టార్పాలిన్లను ఏర్పాటు చేశారంటూ ‘సాక్షి’లో ఇటీవల ప్రచురించిన కథనం పై ఆలయ ఈఓ కెఎన్విడివి ప్రసాద్ స్పందించారు. ఈ మేరకు బ్రిడ్జిపై ఎండ నుంచి భక్తులకు రక్షణగా ఉండేలా టార్పాలిన్లు సరిచేశారు. దీంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.


