ఖాళీ స్థలం.. కనిపిస్తే వదలం..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
పలాస నియోజకవర్గంలో ఆక్రమణలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. భూదందాతో కొందరు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు, వాగులు, కాలువలు, గోర్జ, చెరు వులని చూడకుండా కబ్జా చేసేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఇష్టారీతిన ఆక్రమించేసి, చదును చేసి అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. నియోజకవర్గ కేంద్రమైన పలాస, కాశీబుగ్గలోనే కాకుండా మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో కూడా ప్రభుత్వ భూములను వదలడం లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాగా వేసేస్తున్నారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. కళ్ల ముందే చెరువులు, కాలువలు, గెడ్డలు కబ్జాకు గురవుతుంటే చోద్యం చూస్తున్నారు. అధికారులు ఇలాగే కళ్లు మూసుకుంటే కొండ వూరు పంచాయతీ పరిధిలోకి వచ్చే పగడాల చెరువు, నారాయణపురం నుంచి పెద్ద బొడ్డపాడు వరకు ఉన్న ఎర్రగెడ్డ పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే మూడింతల చెరువు గర్భం కబ్జాకు గురైంది. మిగతాది ఆక్రమించే పనిలో అక్రమార్కులు పడ్డారు.
ఖాళీగా కనిపిస్తే చాలు ఆక్రమణ
పలాస నియోజకవర్గంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడ భూముల ధరలు బంగారం ధరల్లా రోజురోజుకి పెరిగిపోతున్నా యి. దీంతో అక్రమార్కుల కన్ను ఖాళీ భూములపై పడింది. ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ కబ్జా చేసేస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన వాటిలో పలాస నియోజకవర్గం అగ్రగామిగా నిలిచింది. రోజురోజుకీ ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జా కోరులు కబళించేస్తున్నారు. సా గుకు, వ్యాపారాలకు ఆ ఆక్రమణలను వేదికగా చేసుకుంటున్నారు. ఇక్కడ వందలాది ఎకరాలు అక్రమ లావాదేవీల ద్వారా చేతులు మారిపోయా యి. దాదాపు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆక్రమణలే కనిపిస్తున్నాయి.
ఆ మూడు గ్రామాల వారే..
సర్వే నంబర్ 364పరిధిలో గల పగడాల చెరువు 29.86ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే 20ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. తొలుత గట్టు తొలగించేసి మొక్కలు వేసేశారు. ఆ తర్వాత చెరువు గర్భంలోకి ప్రవేశించారు. తుంభవానిపేట, కొల్లిపాడు, కొండ వూరుకు చెందిన 17మంది పెద్దలు ఆక్రమించేశారు. ఆక్రమిత భూముల్లో కొబ్బరి మొక్కలు వేసుకుని సాగు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆక్రమించిన చెరువు భూములను విక్రయాలకు కూడా పెట్టేశారు. ఇప్పటికే కొందరి చేతులు మారిపోయాయి. సెంటు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు ఉంది. ఈ లెక్కన ఎకరా రూ. 30లక్షల వరకు ధర పలుకుతోంది.
ఎర్రగెడ్డను సైతం వదలని అక్రమార్కులు
వజ్రపుకొత్తూరు మండలం నారాయణపురం నుంచి గర్తంవానిపేట మీదుగా పెద్దబొడ్డపాడు వరకు 5కిలో మీటర్ల మేర ఉన్న ఎర్రగెడ్డను ఆక్రమణదారులు వదల్లేదు. ఐదు గ్రామాలకు చెందిన 40మంది వరకు గెడ్డను ఆక్రమించారు. ఎర్రగెడ్డపైన వంశధార 5ఎల్ఆర్ కాలువ ఉండగా, దిగువ వైపు ఎర్రగెడ్డ ఉంటుంది. ఈ గెడ్డనే కాదు ఆనుకుని ఉన్న అటవీ భూములను, కొండ పోరంబోకు భూములను కూడా ఆక్రమించారు.
పలాస నియోజకవర్గంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములు
చెరువులు, గెడ్డలు, కాలువ, కొండలు,
వాగుల కబ్జా
దర్జాగా చదును చేసి అనుభవంలోకి
తెచ్చుకుంటున్న అక్రమార్కులు
ఆక్రమణలతో కనుమరుగవుతున్న వజ్రపుకొత్తూరు మండలంలోని పగడాల చెరువు, ఎర్రగెడ్డ
ఖాళీ స్థలం.. కనిపిస్తే వదలం..!


