నీళ్లు కాలుష్యం పాలు
నగరపాలక సంస్థ
డీఈఈ సస్పెన్షన్
శానిటరీ ఇన్స్పెక్టర్ విధుల నుంచి తొలగింపు
ప్రమాదంలో ప్రజారోగ్యం
ఒక వైపు నీళ్లు.. మరో వైపు పాలు ఎక్కడ చూసినా ‘కలుషితం’ పైనే చర్చ ఆగని డయేరియాతో కేసులు
తాజాగా చికిత్స పొందుతూ మహిళ మృతి
ఆరుకి చేరిన మరణాల సంఖ్య
రంగంలోకి దిగిన ఆహార తనిఖీ బృందాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. పాలు, మంచినీళ్లలో స్వచ్ఛత కొరవడింది. శ్రీకాకుళంలో కలుషిత మంచినీరు, రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో చావులు సంభవించడంతో జిల్లా ప్రజానీకం ఉలిక్కిపడుతోంది. కోరలు చాచిన డయేరియా నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రాత్రి, పగలు తేడా లేకుండా సుడిగాలి పర్యటనలు చేసి, ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. లోపాలున్న చోట సిబ్బందిని అప్రమత్తం చేసి, పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
డయేరియా కేసులు విస్తరిస్తున్న వేళ నగరమంతా యంత్రాంగం అప్రమత్తమైంది. మంచినీటి ట్యాంకులతో పాటు ఎక్కడికక్కడ పైపులైన్లు తనిఖీ చేయడమే కాకుండా శానిటేషన్పైనా దృష్టి సారించారు. మురికి కాలువలను స్వయంగా జిల్లా కలెక్టరే పరిశీలిస్తుండటం తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతానికి మున్సిపల్ మంచినీళ్లు తాగొద్దని కోరుతున్నారు. మరోవైపు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీరియస్గా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వం దృష్ట్యా డీఈఈతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకున్నారు. సంబంధం ఉన్న మున్సిపల్ హెల్త్, ఇతర ఇంజనీర్లను వదిలేసి వీరిపై చర్యలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా ఇష్యూ డైవర్షన్ కోసం చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి.
రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో పలువురు చనిపోవడంతో జిల్లాలో కూడా యంత్రాంగం అప్రమత్తమైంది. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో శ్రీకాకుళం డివిజన్లో మూడు మిల్క్ శాంపిల్స్, టెక్కలి డివిజన్లో 9 శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. పాలులో నీళ్లు, యూరియా, ఆయిల్, ఫార్మాలిన్, పిండి పదార్థాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో శాంపిల్స్ తీశారు. హైదరాబాద్ ల్యాబ్ నుంచి పరీక్షా ఫలితాలు వచ్చాక చర్యలు తీసుకుంటామని ఆహార తనిఖీ అధికారులు చెబుతున్నారు. పాలుపైనే కాకుండా కల్తీ ఆయిల్పైనా దృష్టి సారించారు.
శ్రీకాకుళం : డయేరియాపై ప్రజలు ఎలాంటి ఆందో ళన చెందవద్దని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మా వతి వెల్లడించారు. శనివారం డయేరియా ప్రభావిత ప్రాంతాలైన దమ్మలవీధి, కాకివీధి, బోడెమ్మ కోవెల తదితర వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతిసారం తగ్గుము ఖం పట్టిందన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాల ని, బయట ఆహార పదార్థాలను తినరాదని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా సర్వజన ఆస్పత్రిని సందర్శించి అతిసార బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెతో పాటు జాయింట్ డైరెక్టర్ ఐ.డి.ఎస్.పి డాక్టర్ ఎన్.మల్లేశ్వరి, జిల్లా వైద్యారోగ్యశాఖా ధికారి డాక్టర్ అనిత పాల్గొన్నారు.
శ్రీకాకుళం : శ్రీకాకుళం నగరపాలక సంస్థలో నీటి సరఫరా విభాగం డీఈఈగా విధులు నిర్వహిస్తున్న వి.జగన్మోహనరావును సస్పెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా, దమ్మలవీధి సచివాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న ఎన్.శరత్కుమార్ను విధుల నుంచి తొలగించారు. నగరంలో డయేరియా ప్రబలడానికి విధుల్లో వీరు చూపిన నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ ఈ ఉత్తర్వులను వెలువరించారు. వామనమూర్తి అనే శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు షోకాజ్ నోటీసులు అందుకున్న పలువురు సచివాలయ సిబ్బందిపైనా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
నీళ్లు కాలుష్యం పాలు
నీళ్లు కాలుష్యం పాలు
నీళ్లు కాలుష్యం పాలు


