ప్రతి కూలీకీ150 రోజుల ఉపాధి కల్పించాలి
పనిచేసినా డబ్బులు రావడం లేదు
● కలెక్టర్కు మొరపెట్టుకున్న ఉపాధి కూలీలు
పుట్టపర్తి అర్బన్: ‘‘రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి. నెలల తరబడి పనిచేసినా బిల్లులు మంజూరు కావడం లేదు. చివరకు సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరైనా మాపై దయచూపి ఉపాధి హామీ బిల్లులు సకాలంలో ఇప్పించండి’’ అంటూ పలువురు ఉపాధి కూలీలు తమ గోడును కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎదుట వెళ్లబోసుకున్నారు. శుక్రవారం కలెక్టర్ కొత్తచెరువు మండలం వేములేటిపల్లి గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పించిన 150 రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధి పనుల్లో నీటి సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చేలా చూడాలన్నారు. ఒక్కో కూలీకి రోజూ రూ.300 వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంలోనే కూలీలు తమకు వేతనాలు ఆలస్యమవుతున్నాయని చెప్పగా.. సమస్య పరిష్కరిస్తామన్నారు.
చెన్నేకొత్తపల్లి: ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు 150 రోజులు పని దినాలు కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని బసంపల్లి గ్రామంలో పర్యటించారు. ‘మన పల్లె–మన నీరు’ కార్యక్రమంలో భాగంగా ఫారంపాండ్ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ఉపాధి పనులను కూలీలలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరయ్యేలా చూడాలన్నారు. అనంతరం ప్యాదిండి పంచాయతీ పరిధిలోని నామాల గ్రామానికి వెళ్లిన కలెక్టర్... ఇటీవల వేసిన సీసీ రోడ్ల నాణ్యతను పరిశీలించారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ విజయప్రసాద్, ఏపీడీ చలపతి, ఎంపీడీఓ బాలకృష్ణుడు, ఏపీఓ జయమ్మ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశం


