మాతాశిశు మరణాలు అరికట్టాలి
● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
ఫైరోజా బేగం ఆదేశం
పుట్టపర్తి అర్బన్: ’ఏ మహిళా జన్మనిస్తూ మరణించకూడదు... ఏ శిశువూ మరణించేందుకు జన్మించకూడదు..’ అన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్యాధికారులు పనిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఫైరోజా బేగం ఆదేశించారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సురేష్బాబుతో కలిసి వైద్యాధికారులు, ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ శాఖల సిబ్బందితో సమావేశమయ్యారు. గత జనవరి నెలలో జిల్లాలో చోటుచేసుకున్న ఓ మాతృ, 9 శిశు మరణాలపై సమీక్షించారు. ఆయా ఘటనల పూర్తి వివరాలు ఆరా తీశారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... జనవరి నెలలో జరిగిన మతృ మరణానికి ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోందన్నారు. ఇకపై మత్తుమందు ఇచ్చే వైద్య నిపుణులు, చిన్న పిల్లలు వైద్యులు, సీ్త్ర వైద్య నిపుణులు లేకుండా ఆస్పత్రుల్లో కాన్పులు చేయకూడదని ఆదేశించారు. ఇక కుటుంబీకుల అజాగ్రతతో ఓ శిశువు ప్రాణం కోల్పోయిందన్నారు. మాతాశిశు మరణాలకు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. గర్భిణులకు అవగాహన కల్పించి వారు సుఖప్రసవయ్యేలా చూడాలన్నారు. సమీక్షలో వైద్యులు జయలక్ష్మి, కార్తీక్, 108 ప్రసాద్, సునీల్, నాగేంద్రనాయక్ , డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, సీహెచ్ఓ వన్నప్ప, వైద్య సిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జేఏసీ జిల్లా
నూతన కమిటీ ఎన్నిక
పుట్టపర్తి టౌన్: జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక జేఏసీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు సమావేశమయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరబాబు జేఏసీ జిల్లా కమిటీ ఎన్నిక నిర్వహించారు. అయితే సభ్యులంతా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్గా లింగా రామ్మోహన్, కో చైర్మన్గా నరేంద్ర, షబ్బీర్, నాగార్జునశెట్టి, వైస్ చైర్మన్గా రామకృష్ణ నాయక్, జయరామ్, జనార్దన్, శంకరనారాయణ, జనరల్ సెక్రటరీగా ఆర్.చంద్ర, జాయింట్ సెక్రటరీలుగా శ్రీధర్, గోపాల్నాయక్, బాబా ఫకృద్దీన్, గౌస్లాజమ్, ఆనంద్ నాయక్, వెంకటరాముడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈశ్వర్నాయక్, ట్రెజరర్గా ఎల్.సూర్యనారాయణతో పాటు మరో పదిమందిని ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామన్నారు.
ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం
ధర్మవరం అర్బన్: ఈవీఎంల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన మార్కెట్ యార్డులోని ఈవీఎం గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ల వద్ద ప్రత్యేక భద్రత ఉండాలన్నారు. గోడౌన్ వద్ద సీసీ కెమెరా వ్యవస్థ, ఫైర్ సేఫ్టీ, 24గంటల భద్రతా ఏర్పాట్లపై నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఆర్డీఓ రామసుబ్బయ్య, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన సేవలందించండి..
ధర్మవరంలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డుల్లో కలియదిరుగుతూ వివిధ విభాగాలను పరిశీలించారు. వైద్యుల హాజరు వివరాలను తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్కు సూచించారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ ఆర్డీఓ రామసుబ్బయ్య, డీసీహెచ్ఎస్ మధుసూదన్, వైద్యులు పాల్గొన్నారు.
మాతాశిశు మరణాలు అరికట్టాలి
మాతాశిశు మరణాలు అరికట్టాలి


