15 వరకూ రేషన్ ఇవ్వాల్సిందే
● చౌకదుకాణాలు, పెట్రోలు బంకుల్లో
తనిఖీలు చేయాలి
● జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశం
ప్రశాంతి నిలయం: ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ రేషన్ సరుకులు ఇవ్వాల్సిందేనని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ డీలర్లను ఆదేశించారు. రోజూ ఉదయం, సాయంత్రం రేషన్ దుకాణం తెరిచి ఉంచాలన్నారు. శుక్రవారం ఆయన, కలెక్టరేట్లోని వీసీ హాలులో పౌరసరఫరాల శాఖ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ...65 ఏళ్లుపైబడిన వారికి నిత్యావసరాలను ఇంటి వద్దకే వెళ్లి అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పౌరసరఫరాల చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నిత్యావసర వస్తువుల చట్టం–1955 ఉల్లంఘించిన వారిపై 6(ఏ) కేసులు నమోదు చేయాలన్నారు. అలాగే జిల్లాలోని చౌక దుకాణాలు, పెట్రోలు బంకుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. పెట్రోలు బంకుల్లో డిప్యూటీ తహసీల్దార్లు, కంపెనీ సేల్స్ అధికారులు ప్రతి నెలా తనిఖీలు నిర్వహించాలన్నారు. అర్హులందరికీ సబ్సిడీ అందేలా చూడాలన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
పుట్టపర్తి: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు హిస్టరీ పేపర్–1, ఒకేషనల్ విద్యార్థులు ఒకేషనల్ పేపర్–1 పరీక్ష నిర్వహించారు. 26 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు జనరల్ విద్యార్థులు 537 మందికి గాను 471 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 66 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి (డీఐఈఓ) చెన్న కేశవప్రసాద్ తెలిపారు. అలాగే ఒకేషనల్కు పరీక్షకు 1,405 మందికి గాను 1,290 మంది హాజరుకాగా, 115 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. జనరల్, ఒకేషనల్కు సంబంధించి మొత్తం 181 మంది విద్యార్థులు శుక్రవారం పరీక్షకు గైర్హాజరైనట్లు డీఐఈఓ వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.


