అమ్మాయికి మైనార్టీ తీరితేనే పెళ్లి చేయాలి
పుట్టపర్తి అర్బన్: బాల్య వివాహాల కట్టడికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. ముఖ్యంగా వివాహాలు చేసే పురోహితులు, పాస్టర్లు, ఖాజీలు తప్పనిసరిగా అమ్మాయి వయస్సును నిర్ధారించే బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండితేనే వివాహం చేయాలని సూచించారు. శుక్రవారం పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల కట్టడికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 ఏళ్లు పూర్తయితేనే పెళ్లి చేయాలన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, వాటిని నిరోధించడానికి సహకరించాలని పురోహితులు, పాస్టర్లు, ఖాజీలను కోరారు. ఆధార్ కార్డు కాకుండా... బర్త్ సర్టిఫికెట్లు ప్రామాణికంగా పెళ్లి చేయాలన్నారు. ఎవరైనా బాలికల మైనార్టీ తీరకుండానే పెళ్లి చేయాలని భావించి మీ వద్దకు వస్తే.. వారికి బాల్య వివాహాల వల్ల అనర్థాలను తెలియజేయాలన్నారు. అలాగే బాల్య వివాహం చేయడం వల్లే చట్టపరంగా ఎదురయ్యే సమస్యలూ వివరించాలన్నారు. అవసరమైతే వెంటనే ఐసీడీఎస్, చైల్డ్లైన్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం ఐసీడీఎస్ రూపొందించిన వివాహ నిరోధక చట్టం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీసీపీఓ మహేష్, ప్రొటెక్షన్ ఆఫీసర్లు నాగలక్ష్మి, మురళీధర్, కోఆర్డినేటర్ కొండప్ప, సిబ్బంది వనజాక్షి, శివ, లత పాల్గొన్నారు.
వివాహ సమయంలో తప్పకుండా
బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి
పురోహితులు, పాస్టర్లు, ఖాజీలకు
అవగాహన కల్పించిన కలెక్టర్


