
సీట్లు ఫుల్.. అడ్మిషన్లు డల్
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 13 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో తొలి విడత ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్లో 9 వేల సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా నాలుగు వేల సీట్లు భర్తీ కావాల్సి ఉంది.
ఫీజులతో
బాదుడే బాదుడు..
తొలి విడతలో సీట్లు దక్కిన విద్యార్థులు తక్షణమే కళాశాలలో చేరాలి. లేదంటే సీటు రద్దవుతుందంటూ యాజమా న్యాలు బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థుల నుంచి కూడా యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తున్నాయి. బిల్డింగ్, వర్సిటీ, ల్యాబ్ అంటూ ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేలు లాగుతున్నాయి. సాధారణంగా తొలి విడత కౌన్సెలింగ్లో నచ్చిన కళాశాలలో లేదా మెచ్చిన కోర్సులో సీటు రాని విద్యార్థులు రెండో దఫా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తారు. అయితే, తొలి విడత సీటు వచ్చిన కళాశాలలో ఆయా ఫీజులు చెల్లిస్తే, వేరే కళాశాలకు వెళ్లేటప్పుడు ఆ మొత్తం తిరిగి ఇవ్వబోమని యాజమాన్యాలు స్పష్టం చేస్తుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్పై అనుమానం..
కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పడుతున్నాయి. ఒకటి.. అర కాదు ఏకంగా ఆరు క్వార్టర్ల చెల్లింపులు పక్కన పెట్టడంతో విద్యార్థులు విసుగెత్తి చదువులు మానేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు బీటెక్ను రాష్ట్రంలో చదివే బదులు కర్ణాటక, తెలంగాణలో మంచి ఇంజినీరింగ్ కళాశాలలో చేరడం మేలని భావించి.. అక్కడ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఫలితంగా ఇక్కడ ఇంజినీరింగ్ సీట్లు భర్తీ కావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం పుణ్యమా అని ఉన్నత విద్య భ్రష్టు పట్టిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
చేరాలా.. వద్దా..?
ఇటీవల ఏపీఈఏపీసెట్ రెండో కౌన్సెలింగ్కు సంబంధించి విద్యార్థులు పలు కళాశాలలకు ఆప్షన్ ఇచ్చారు. ఈ నెల మూడో తేదీనే కళాశాలలు కేటాయించాల్సి ఉంది. అయితే, తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణించడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పు వెలువరించేంత వరకు రెండో దఫా కౌన్సెలింగ్ జరగదు. ఈ నేపథ్యంలో దూరప్రాంతాల్లో సీటు వచ్చిన విద్యార్థులు తమకు సమీపంలో ఉండే కళాశాలలో సీటు కోసం ఎదురుచూడాలా.. లేక ఇప్పటికే సీటు దక్కిన కళాశాలలోనే బీటెక్ చదవాలా.. అనే సంశయంలో పడ్డారు.
2024 వరకు ఇబ్బంది లేదు..
రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని, ఉమ్మడి విద్యా వ్యవస్థ ఉండేది. తెలంగాణలో చదివినా, ఏపీలో చదివినా లోకల్గా పరిగణించేవారు. 2024 నుంచి ఈ నియమం తొలగించారు. దీంతో తెలంగాణలో చదివిన ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య ఏర్పడింది. అవగాహన లేక తమ పిల్లలను తెలంగాణలో ఇంటర్ చదివించిన తల్లిదండ్రుల బాధ నేడు వర్ణనాతీతంగా మారింది.
రాప్తాడుకు చెందిన ఫణి కుమార్ కుమార్తె భావనకు ఏపీఈఏపీసెట్లో 17 వేల ర్యాంకు వచ్చింది. అయితే, భావన ఇంటర్ తెలంగాణలో చదవడంతో రాష్ట్ర అధికారులు ‘స్థానికేతరుల’ జాబితాలో చేర్చారు. దీంతో ఏపీఈఏపీ సెట్లో మంచి ర్యాంకు దక్కినప్పటికీ రాష్ట్రంలో భావన కోరుకున్న
కళాశాలలో సీటు దక్కలేదు. దీనికితోడు నాన్ లోకల్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని తెలియడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరింది. ఈ అమ్మాయి ఒక్కరే కాదు.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా వేలాది మంది విద్యార్థులు పొరుగు రాష్ట్రాల్లో బీటెక్ అడ్మిషన్లు పొందడం గమనార్హం.
జిల్లాలో ఇంజినీరింగ్ కోర్సుల్లో
అడ్మిషన్లకు విద్యార్థుల అనాసక్తి
‘స్థానికతపై కూటమి ప్రభుత్వ
నిర్లక్ష్య వైఖరితో దుస్థితి
పొరుగు రాష్ట్రాల్లోని కళాశాలల్లో చేరడానికే మొగ్గు

సీట్లు ఫుల్.. అడ్మిషన్లు డల్