
7 లారీల రేషన్ బియ్యం స్వాధీనం
యాడికి: అక్రమంగా రైస్ మిల్లులో నిల్వ చేసిన టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు యాడికి తహసీల్దార్ ప్రతాపరెడ్డి, సీఐ ఈరన్న తెలిపారు. వివరాలను సోమవారం వారు వెల్లడించారు. యాడికిలోని పెద్దపేటకు పోతున్న మార్గంలో ఉన్న బలరాముడు రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లుగా తెలుసుకున్న అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని గుర్తించిన అధికారులు వెంటనే విషయాన్ని తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి దృష్టికి తీసుకెళ్లి భద్రత కల్పించాలని కోరారు. దీంతో ఆయన ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్నారు. 50 కిలోల చొప్పున ఒక్కో బస్తాలో నింపి ఒక్కో లారీలో 30 నుంచి 32 టన్నుల వరకు హమాలీల ద్వారా లోడ్ చేయించారు. మొత్తం ఏడు లారీల్లో 215 టన్నుల రేషన్ బియ్యాన్ని గుంతకల్లులోని స్టాక్ పాయింట్కు తరలించినా... ఇంకా మిగులు ఉంది. ఈ బియ్యాన్ని కూడా స్టాక్ పాయింట్కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసే వరకూ ఆ రైస్ మిల్లు పరిసరాల్లోకొ కొత్త వ్యక్తులను రానివ్వకూడదని, మిల్లు చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఐ ఈరన్నను ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఎం.రమణయ్య, డీటీ శ్రీనివాసులు, సీఎస్డీటీ మల్లేసు, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.