
తీరనున్న టీచర్ల వేతన వెతలు
కదిరి: ఎట్టకేలకు బదిలీ అయిన టీచర్ల వేతన వెతలు తీరనున్నాయి. ‘బదిలీ టీచర్లకు వేతన వెతలు’ శీర్షికన గురువారం ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనానికి ఏపీ విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు స్పందించారు. గురువారం ఆయన అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి సెలవుల్లో బదిలీ అయిన టీచర్లకు ఇంత వరకూ జీతాలు ఇవ్వలేదని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువగా ఉందని ఆయన వాస్తవ విషయాన్ని ఒప్పుకున్నారు. దీనిపై రోజంతా కసరత్తు చేసైనా సరే..ఆయా టీచర్లందరికీ తక్షణం పొజిషన్ ఐడీలు క్రియేట్ అయ్యేలా తానే దగ్గరుండి సమస్యకు పరిష్కారం లభించేలా చూస్తానన్నారు. పొజిషన్ ఐడీలు క్రియేట్ అయిన వెంటనే డీడీఓలు స్థానిక ఎస్టీఓ కార్యాలయాలకు వెళ్లి యుద్ధ ప్రాతిపదికన డీడీఓ లాగిన్ యాక్టివేషన్ చేసుకునేలా చూడాలని కమిషనర్ ఆదేశించారు. ఏమాత్రం ఆలస్యం చేసినా శుక్ర, శని, ఆది ఇలా వరుసగా 3 రోజులు సెలవులు ఉన్నాయనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు.
‘చిత్రావతి’ సుందరీకరణ పనులు ప్రారంభం
పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో చిత్రావతి నదీ తీర ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ తెలిపారు. గురువారం పుట్టపర్తి పట్టణంలో ఉన్న చిత్రావతి నదీ తీర ప్రాంతంలో చేపట్టనున్న పనులను సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే రత్నాకర్, ఎమ్మెల్యే సిఽంధూరారెడ్డితో కలసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చిత్రావతి పరిసరాల సుందరీకరణకు జోయాలుకాస్ ఫౌండేషన్ రూ.1.20 కోట్లు వితరణ చేసిందన్నారు. చిత్రావతి నది తీరప్రాంతంలో పార్కు, జిమ్ము తదితర పనులు చేస్తున్నట్లు చెప్పారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఇరిగేషన్ ఏఈ సుధాకర్రాజు, ఏఈఈ జానకీబాయ్ పాల్గొన్నారు.
పలు రైళ్లకు అదనపు బోగీలు
గుంతకల్లు: ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా గుంతకల్లు డివిజన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం–ధర్మవరం (17215/16) ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ నెల 10,11వ తేదీల్లో 2టైర్ ఏసీ బోగీ, తిరుపతి–హబ్లీ (57401/02), తిరుపతి–గుంతకల్లు (57403/04) ప్యాసింజర్ రైళ్లకు 13,14 తేదీల్లో రెండు స్లీపర్ బోగీలను అటాచ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధగంగా తిరుపతి–కదిరిదేవరపల్లి (57405/06) ప్యాసింజర్ రైళ్లకు ఈ నెల 15,16వ తేదీల్లో రెండు స్లీపర్ బోగీలను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

తీరనున్న టీచర్ల వేతన వెతలు