
వైభవంగా ఖాద్రీశుడి కల్యాణోత్సవం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రంగ మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత వసంతవల్లభునికి సోమవారం కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో అర్చకులు సంతోష్ స్వామి, మంజునాథ్ స్వామి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ చేశారు. హోమాలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
‘బిల్లులు చెల్లించకపోతే ఎలా బతకాలి?’
లేపాక్షి: ఉపాధి పనులు చేసి ఆరు నెలలు గడుస్తున్నా నేటికీ బిల్లులు చెల్లించకపోతే తామెలా బతకాలంటూ ఎంపీడీఓ నరసింహమూర్తిని లేపాక్షి మండలం మానేపల్లి పంచాయతీ గౌరిగానిపల్లికి చెందిన ఉపాధి కూలీలు నిలదీశారు. సోమవారం ఉదయం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉపాధి కింద సోప్ పిట్ పనులు పూర్తి చేసి సుమారు ఆరు నెలలు గడుస్తోందన్నారు. ఒక్కో సోప్ పిట్ నిర్మానానికి రూ.5వేలు మంజూరు చేశారని, ఇప్పటి వరకూ ఆ బిల్లులు మంజూరు చేయలేదంటూ మండిపడ్డారు. ఇంట్లోని బంగారు నగలు కుదువ పెట్టి కేటాయించిన పని పూర్తి చేశామన్నారు. ఇప్పటికై నా తమకు బిల్లులు మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో ఎంపీడీఓ మాట్లాడుతూ.. బిల్లుల మంజూరుకు ప్రభుత్వానికి నివేదికలు అందజేశామని, రాగానే కూలీల ఖ్యాతాల్లోకి జమ చేస్తామని భరోసానిచ్చారు.
వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు
కదిరి టౌన్: రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఈ విషయంగా నిర్లక్ష్యం వీడాలంటూ వైద్య, ఆరోగ్య సిబ్బందిని కదిరిలోని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. కాగా, ఆదివారం రాత్రి పాము కాటుకు గురైన నల్లచెరువు మండలానికి చెందిన రాజశేఖర్ నాయుడుని ఏరియా ఆస్పత్రికి తీసుకువస్తే వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వారిపై ఎంఎల్ రామచంద్ర దురుసుగా వ్యవహరించడంతో బాధితులు దాడి చేశారు. దీంతో రామచంద్రపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఉదయం వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో సీఐ నారాయణరెడ్డి అక్కడకు చేరుకుని సర్దిచెప్పార. అనంతరం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు.
పోక్సో కేసులో ముగ్గురి అరెస్ట్
హిందూపురం: మాయ మాటలతో మైనర్ బాలికను తీసుకెళ్లిన కేసులో ముగ్గురు యువకులను పోక్సో కేసు కింద సోమవారం అరెస్ట్ చేసినట్లు హిందూపురం రూరల్ పోలీసులు తెలిపారు. గత నెల 26న కొటిపి ఎస్సీ కాలనీకి చెందిన మైనర్ బాలికను నమ్మించి అదే ప్రాంతానికి చెందిన సతీష్, నాగరాజు, శ్రీరంగరాజుపల్లి ఫణిసింహ పిలుచుకెళ్లారన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం ముగ్గురిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, సోమవారం కిరికెర గేట్ వద్ద నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
క్రీడలు ఆడుతుండగా విరిగిన విద్యార్థిని చెయ్యి
చిలమత్తూరు(లేపాక్షి): లేపాక్షి మండలంలో కొండూరులోని జెడ్పీహెచ్ఎస్లో సోమవారం క్రీడలు ఆడుతుండగా ఆరో తరగతి విద్యార్థిని లిఖిత చెయ్యి విరిగింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గోప్యంగా ఉంచారు. విద్యార్థిని ఇంటికి వెళ్లిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చెయ్యి విరిగిన విషయాన్ని ఎవరితోనూ చెప్పరాదంటూ పీఈటీ హెచ్చరించినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

వైభవంగా ఖాద్రీశుడి కల్యాణోత్సవం

వైభవంగా ఖాద్రీశుడి కల్యాణోత్సవం