● నెల్లూరులో సీఐటీయూ బైక్ ర్యాలీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, విద్య, వైద్యశాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాల్సిందేనని సీఐటీయూ నెల్లూరు నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనిని నగరాధ్యక్షుడు అత్తిమూరు శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. శెట్టిగుంటరోడ్డు సెంటర్లోని సీపీఎం కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పప్పులవీధి, స్టోన్హౌస్పేట, ఆత్మకూరు బస్టాండ్, మినీబైపాస్ రోడ్డు, ముత్తుకూరు గేటు మీదుగా వీఆర్సీసెంటర్, గాంధీబొమ్మ సెంటర్, ఏబీఎం కాంపౌడ్ వరకు సాగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దుకాణాలు, షాపింగ్ మాల్స్, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, 104, 108, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యమిత్ర, అర్బన్హెల్త్, ఆయూష్ తదితర చోట్ల పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసి వాటి స్థానంలో పాత కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యలపై ఈనెల 30వ తేదీన వీఆర్సీ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఇందులో కార్మికలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ, డీవైఎఫ్ఐ నాయకులు రాంబాబు, మూలం ప్రసాద్, సుధాకర్, కామాక్షి, అశోక్, నరసింహ, అంకయ్య, సూర్యనారాయణ, మల్లెమ్మ, మధు, వెంకటేశ్వర్లు, మాలకొండేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


