నెల్లూరు (పొగతోట)/మర్రిపాడు/కలిగిరి (ఉదయగిరి): జిల్లాలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు, మెరుపులు, పెనుగాలులకు వర్షం తోడుకావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నెల్లూరు నగరంలో గురువారం రాత్రి 7 గంటల తరువాత ఒక్కసారిగా ఈదురుగాలు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి వరకు కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. నగర రోడ్లపై వెళ్తున్న ద్విచక్ర వాహనచోదకులు ఈదురు గాలులకు పట్టుతప్పి పడిపోయారు. కొందరు బైక్లను రోడ్డు పక్కన నిలిపేసి దుకాణాల్లో తలదాచుకున్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో చెట్ల కొమ్మ లు విరిగిపడ్డాయి. ఇంటిపైన ఉన్న రేకులు, గేట్లకు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రేకులు ఎగిరిపోయి పక్క ఇళ్లపై పడ్డాయి. భారీ ఈదురు గాలులు వీయడంతో పలు చోట్ల పూరిళ్లు, రేకుల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. మరి కొన్ని ప్రాంతాల్లో మామిడి, నిమ్మ తోటల్లో కాయ లు నేలరాయి. రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో ఆయా మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్రిపాడు మండలం చిన్నమాచనూరులో ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు నేలకూలాయి. పూరి గుడిసెల పైకప్పులు లేచిపోగా, విద్యుత్ స్తంభాల విరిగినట్లు, తీగలు తెగిపడ్డాయి. కలిగిరి మండలం కుమ్మరకొండూరులో నోటి రవీంద్రమ్మ, కందులవారిపాళెం ఎస్సీ కాలనీలో దారా మాలకొండయ్యకు చెందిన రేకుల ఇళ్లకు సంబంధించి పైకప్పులు ఎగిరిపోయాయి. ఇంటిపైన ఉన్న సిమెంట్ రేకుల కప్పులు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో చీకట్లోనే మగ్గుతున్నాయి.
ఉరుమురులు, పిడుగులతో వర్షం
జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి వరకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంత రాయం
చీకట్లో పట్టణాలు, పల్లెలు
పలు చోట్ల రేకుల, పూరిళ్లు ధ్వంసం
నెలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పండ్ల తోటల్లో రాలిన కాయలు


