నెల్లూరు(వీఆర్సీసెంటర్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని, వాటిని తిప్పి కొట్టేందుకు కార్మిక సంఘాలు ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని సీపీఎం జిల్లా, నగర కార్యర్శులు మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో నగర, రూరల్ సీపీఎం కమిటీలు, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. ఏబీఎం కాంపౌండ్ నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ను తీసుకొచ్చిందన్నారు. కార్మికులను బానిసలుగా మార్చే నూతన లేబర్కోడ్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మికుల పొట్టకొడుతున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని ప్రజలు, కార్మికుల పక్షాన నిలబడాలని, లేని పక్షంలో వారే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీపీఎం, సీఐటీయూ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, మోహన్రావు, మస్తాన్బీ, కొండాప్రసాద్, నాగేశ్వరరావు, చండ్రా రాజగోపాల్, అరిగెల రమమ్మ, షాహీనాబేగం, సుధాకర్, పెంచల నరసయ్య ,సతీష్, శ్రీనివాసులరెడ్డి, నజీర్, ఉడతా ప్రసాద్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.


