హైకోర్టు ఉత్తర్వులున్నా.. డోంట్‌కేర్‌ | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఉత్తర్వులున్నా.. డోంట్‌కేర్‌

Apr 30 2026 8:55 AM | Updated on Apr 30 2026 8:55 AM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్వేపల్లిలో టీడీపీ నేతల అరాచక దోపిడీ ‘నభూతో నభవిష్యతి’ అన్నట్లుగా సాగుతోంది. దీపం ఉండానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో ఎడాపెడా ప్రకృతిని చెరబట్టి ఖనిజాల సంపదను దోచుకుంటున్నారు. ఆ పార్టీ నేతలు విసిరే ముష్టికి కక్కుర్తి పడిన అధికార యంత్రాంగాలు వృత్తి ధర్మాన్ని తాకట్టు పెట్టేశారు. మైనింగ్‌, రెవెన్యూ, విజిలెన్స్‌ శాఖలు అయితే ముఖం చాటేసి తమ స్వామిభక్తిని చాటుకుంటుంటే.. ఇక పోలీస్‌ శాఖ మాత్రం ఖాకీ చొక్కాలు విడిచేసి ఊడిగం చేసే స్థాయికి చేరింది. ప్రకృతి ఖనిజ సంపదను తమ సరిహద్దులు దాటించే వరకు రక్షణ కల్పిస్తున్నారు. ప్రజల బతుకుదెరువు అయిన పంట భూములను కబళిస్తుంటే.. అడ్డుపడే వారిని బెదిరించి స్టేషన్‌లో నిర్బంధించి మరీ సాయ పడుతున్న పరిస్థితికి దిగజారారు.

అనుమతులు లేకున్నా.. హైకోర్టు స్టే ఉన్నా..

ఎక్కడైనా మైనింగ్‌ చేయాలంటే.. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంది. అయితే టీడీపీ నేతలకు ఈ నిబంధనలతో పనిలేదు. మైనింగ్‌పై ప్రజావ్యతిరేకత నేపథ్యంలో సాక్షాత్తు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులు ఉన్నా.. డోంట్‌ కేర్‌ అనే రీతిలో ధిక్కరించి, మైనింగ్‌, పోలీస్‌, రెవెన్యూ, విజిలెన్స్‌ శాఖల అండదండలతో విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. సర్వేపల్లిలో రెండేళ్లుగా రూ.వందల కోట్ల విలువైన ఇసుక, గ్రావెల్‌ను కొల్లగొట్టుతున్నా.. తాజాగా క్వార్ట్‌ ్జ, ఫెల్స్‌పర్‌, వర్ముఖ్‌లైట్‌ వంటి అత్యంత ఖరీదైన ఖనిజాన్ని దోచుకెళ్తున్నా.. అడ్డుకునేందుకు ఈ శాఖల యంత్రాంగాలు దమ్ము, ధైర్యం ప్రదర్శించలేకపోతున్నాయి.

పొదలకూరు మండలం ముదిగేడు గ్రామ సమీపంలోని మైన్‌ నుంచి కొద్ది రోజులుగా అత్యంత విలువైన క్వార్ట్‌ ్జ, ఫెల్స్‌పర్‌, వర్ముఖ్‌లైట్‌ వంటి ఖనిజాలను వెలికితీసి నిత్యం వందల టన్నులు ఎగుమతులు చేస్తున్నారు. అయితే ఇక్కడ మైనింగ్‌ చేయడానికి హైకోర్టు స్టే విధించి ఉంది. దీనికి కనీసం పర్యావరణ అనుమతులివ్వలేదు. అయినా అడ్డగోలుగా ఖనిజాన్ని తవ్వేసి దోచుకెళ్తున్నారు. 2022లో ముదిగేడులో మైనింగ్‌ వ్యవహారం అప్పట్లో పెద్ద వివాదమైంది. బ్లాస్టింగ్‌తో దగ్గరలోని నిమ్మతోటలకు, రైతులకు, చుట్టు పక్కల మేతకు వెళ్లే పశువులకు ప్రమాదం పొంచి ఉందని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2022 మే 6న గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ మైనింగ్‌కు పర్యావరణ అనుమతులు లేవని చెప్పడంతో, పర్యావరణ అనుమతులు ఉంటేనే మైనింగ్‌ చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వులతో అప్పటి మైనింగ్‌ అధికారులు మైనింగ్‌ను నిలిపివేశారు. అప్పటి వరకు వెలికి తీసిన క్వార్ట్‌ ్జ, ఫెల్స్‌పర్‌, వర్ముఖ్‌లైట్‌ అక్కడ గుట్టలు గుట్టలుగా ఉండిపోయాయి. ఈ ఖనిజాన్ని కూడా పర్యావరణ శాఖ అనుమతులు మేరకే తరలించాలని స్పష్టంగా పేర్కొంది. అయితే కోర్టు స్టే ఉత్తర్వులను ధిక్కరించి అధికారమే అండగా రెచ్చపోతూ టీడీపీ నేతలు వెలికి తీసిన ఖనిజాన్ని అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల గ్రామస్తులు ప్రశ్నించిన తర్వాత కొద్ది రోజులు నిలిపివేసిన వారు తిరిగి విలువైన ఖనిజాన్ని కల్యాణపురంలో పొలాన్ని లీజుకు తీసుకుని యార్డు ఏర్పాటు చేసి తరలించి గ్రేడింగ్‌ చేయిస్తున్నారు. తాజాగా గ్రామస్తులు ప్రశ్నిస్తే తమకు అనుమతులు వస్తాయని, తమ వద్ద తరలింపునకు సంబంధించిన పేపర్స్‌ ఉన్నాయని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమతులు ఉంటే రాత్రి వేళల్లో గ్రామం మీదుగా కాకుండా అడ్డదారుల్లో ఎందుకు రాయిను తరలిస్తున్నారని ప్రశ్నలకు వారి నుంచి సమాధానం రావడం లేదు. అధికార పార్టీ ముఖ్య నేత కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం భారీగానే ముడుపులు ముట్టాయని గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండు వారాల క్రితం పోలీసులు మైనింగ్‌ వద్దకు వెళ్లి పరిశీలించి ఖనిజాన్ని తరలించొద్దని నామమాత్రంగా హెచ్చరించినట్లు సమాచారం.

అనుమతులు ఎవరిచ్చారు

పర్యావరణ అనుమతులు లేకున్నా.. అక్రమ తవ్వకాలు

సర్వేపల్లిలో బరితెగించిన టీడీపీ నేతలు సర్వం స్వాహా

ముఖ్యనేత నేతృత్వంలో ఇప్పటికే ఇసుక, గ్రావెల్‌, బూడిద అక్రమ రవాణా

తాజాగా పొదలకూరులో క్వార్ట్‌ ్జ, ఫెల్స్‌పర్‌, వర్ముఖ్‌లైట్‌ ఖనిజాల

అక్రమ రవాణా

దగ్గర్లోని యార్డుకు

నిత్యం వందల టన్నుల తరలింపు

నిరోధించే దమ్ము మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖలకు లేవు

ఇతరులు అడ్డుకునేందుకు

వెళ్తే పోలీసుల మోహరింపు

గతంలో మైనింగ్‌ జరగకపోయినా

కాకాణిపై కోకొల్లలుగా కేసులు నమోదు

మైనింగ్‌కు అనుమతుల్లేవు

పొదలకూరు మండలం ముదిగేడులోని మైనింగ్‌కు ఎటువంటి అనుమతుల్లేవు. పర్యావరణ శాఖ నుంచి అనుమతులు ఇవ్వలేదు. ఇక్కడి మైనింగ్‌ చేయొద్దని హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నాయి. గతంలో తవ్విన మెటీరియల్‌ తరలించొద్దని ఆదేశాలు ఉన్నాయి. మైనింగ్‌ను అడ్డుకుంటాం. ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసరావు, మైనింగ్‌ ఏడీ, నెల్లూరు

మైనింగ్‌ వద్ద చాలా రోజులుగా వెలికితీసిన క్వార్ట్‌ ్జ, ఫెల్స్‌పర్‌ ఖనిజం తరలింపునకు ఎవరు అనుమతులిచ్చారో చెప్పడం లేదు. మైన్‌ యజమాని హైదరాబాద్‌కు చెందిన వారికి బల్క్‌గా అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. వారు ఇక్కడ అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని రాయిను గ్రేడింగ్‌కు తరలిస్తున్నారు. మైన్‌కు పర్యావరణ అనుమతులు లేవని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. న్యాయస్థానం ఉత్తర్వులను సైతం బేఖాతరు చేసి మైన్‌ వద్ద ఉన్న రాయిను ఇష్టానుసారం తరలించడంపై మండి పడుతున్నారు. వెంటనే మైనింగ్‌ అధికారులు చొరవతీసుకుని చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement