సరదాగా మాట్లాడుకుని వెళ్తుండగా..
● లారీ రూపంలో కబళించిన మృత్యువు
● ఇద్దరు స్నేహితుల మృతి
నెల్లూరు(క్రైమ్): వారిద్దరు స్నేహితులు. వారి స్నే హాన్ని చూసి విధికి కన్ను కుట్టిందో ఏమో తెలియదు. లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన నెల్లూరు జాతీయ రహదారిపై కొత్త పెన్నాబ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. నార్త్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. శెట్టిగుంటరోడ్డు జీనిగలవీధికి చెందిన స్వర్ణ హేమేంద్ర దర్శక్బాబు (22), వెంకటేశ్వరపురానికి చెందిన షేక్ నూరుల్లా (20) స్నేహితులు. దర్శక్బాబు కార్ల షోరూమ్లో టెక్నీషియన్గా పనిచేస్తుండగా, నూరుల్లా ఏసీ మెకానిక్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం స్నేహితులిద్ద రూ నెల్లూరులో కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. రాత్రి బైక్పై జాతీయ రహదారి మీదుగా వెంకటేశ్వరపురానికి బయలుదేరారు. కొత్త పెన్నా బ్రిడ్జిపైకి వచ్చేసరికి చైన్నె వైపు నుంచి కావలి వైపు వెళ్తున్న లారీ వేగంగా వారిని ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ను ఢీకొట్టింది. దీంతో స్నేహితులిద్దరూ రోడ్డుపై పడ్డారు. దర్శక్బాబు తలకు తీవ్రగాయమై మృతిచెందాడు. నూరుల్లా లారీ చక్రాల కింద నలిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు బాబు తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు నార్త్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై బలరామిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


