
పన్నుల ఆదాయం.. అభివృద్ధికే
నెల్లూరు సిటీ: రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి పనులకు వెచ్చించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి నర్తకి సెంటర్ వరకు ర్యాలీని శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెలకో థీమ్తో ముందుకెళ్తున్నామని, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనేదే లక్ష్యమని చెప్పారు. రానున్న అక్టోబర్ నాటికి చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్ స్రవంతి, డిప్యూటీ మేయర్ రూప్కుమార్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.