
రేపటి నుంచి ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ
భారత్ నుంచి 36 మంది షూటర్లు బరిలోకి
మ్యూనిక్: పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత స్వప్నిల్ కుసాలే ప్రపంచకప్ పతకాలపై గురి పెట్టేందుకు తాజాగా సిద్ధమయ్యాడు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్కప్ లో అతనితో పాటు మహిళా షూటర్, ఒలింపియన్ ఇలవేనిల్ వలారివన్లపై భారత్ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో జరుగుతున్న మూడో ప్రపంచకప్కు మ్యూనిక్ వేదిక కాగా... 78 దేశాలకు చెందిన 695 మంది మేటి షూటర్లు పాల్గొంటుండటంతో ప్రతీ ఈవెంట్లోనూ గట్టి పోటీ ఉండనుంది.
గతేడాది పారిస్లో పతకాన్ని సాకారం చేసుకున్న కుసాలే ఈ ఏడాది దేశవాళీ సర్క్యూట్లో తన ఫామ్ను కొనసాగించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో భారత ఆశాకిరణమయ్యాడు. రెండుసార్లు ఒలింపియన్ అయిన తమిళనాడు షూటర్ ఇలవేనిల్ పారిస్ మెగా ఈవెంట్ తర్వాత తిరిగి ఇప్పుడే అంతర్జాతీయ ఈవెంట్లో గురి పెట్టేందుకు సన్నద్ధమైంది. ఆమె గతంలో బ్యూనస్ఎయిర్స్ (అర్జెంటీనా), లిమా (పెరూ) ఈవెంట్లలో పాల్గొన్నప్పటికీ ఈ రెండు కేవలం ర్యాంకింగ్ పాయింట్ల (ఆర్పీఓ)కు పరిమితమైన పోటీలు మాత్రమే! వీటిని అంతర్జాతీయ షూటింగ్ పోటీలుగా పరిగణించరు.
వీరిద్దరితో పాటు ఆసియా క్రీడల చాంపియన్ పలక్ గులియా మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పతకాలపై గురి పెట్టనుంది. ఈ హరియాణా షూటర్తో పాటు కొత్తగా ఈ ప్రపంచకప్లో అరంగేట్రం చేయబోతున్న జాతీయ ఎయిర్ రైఫిల్ చాంపియన్ అనన్య నాయుడు, పురుషుల ఈవెంట్లో ఆదిత్య మల్రా, నిశాంత్ రావత్ కొత్తగా వరల్డ్కప్ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ షూటర్ల నుంచి వచ్చే సవాళ్లను ఏ మేరకు ఎదుర్కొంటారో చూడాలి.
ఓవరాల్గా ఈ టోర్నీలో భారత్ నుంచి 36 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మద్దినేని ఉమామహేశ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీపడనున్నాడు. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన పిస్టల్ షూటర్ మనూ భాకర్ ఈ ఏడాది రెండోసారి ప్రపంచకప్ టోర్నీ ఆడనుంది. లిమాలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో మనూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది.
ఈ సీజన్లో ఇప్పటికే రెండు ప్రపంచకప్లు అర్జెంటీనా, పెరులో జరిగాయి. ఈ రెండు మెగా ఈవెంట్లలో కలిపి భారత్ ఆరు స్వర్ణాలు సహా 15 పతకాలు గెలుపొందింది. ఈ ప్రదర్శన ద్వారా అర్జెంటీనాలో రెండో స్థానం, పెరు ఈవెంట్లో మూడో స్థానంలో భారత్ నిలిచింది. అయితే మ్యూనిక్లో మాత్రం ఎక్కువ దేశాల నుంచి వందల సంఖ్యలో మేటి షూటర్లంతా బరిలో ఉండటంతో భారత్ ఏ స్థానంలో నిలుస్తుందో ఆసక్తికరంగా మారింది.
చైనా తమ చాంపియన్ షూటర్లు జియి యు, లి యుహంగ్ సహా 22 మందితో మ్యూనిక్కు చేరుకోగా... ఆతిథ్య జర్మనీ మాజీ ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ క్రిస్టియాన్ రిట్జ్, అన జాన్సెన్ సహా 27 మంది మేటి షూటర్లతో పతకాలపై గురి పెట్టింది. మరోవైపు ఫ్రాన్స్ తమ దిగ్గజ షూటర్ జీన్ క్విక్వాంపొయిక్స్తో పాటు 16 మందితో ప్రపంచకప్కు రెడీ అయ్యింది.
ఇద్దరు ఒలింపిక్ చాంపియన్లు యంగ్ జిన్, ఒ యెజిన్లతో కూడిన 19 మంది కొరియన్ బృందం కూడా పతకాలు కొల్లగొట్టేందుకు సై అంటోంది. వీరితో పాటు పలువురు పారిస్ ఒలింపిక్ పతక విజేతలు, అమెరికా, ఇటలీ, కజకిస్తాన్ స్టార్ షూటర్లు మ్యూనిక్ వరల్డ్కప్కు వన్నెతెచ్చే రసవత్తరపోటీకి ‘ఢీ అంటే ఢీ’ అంటున్నారు.