Womens Asia Cup T20 2022: India Beat Thailand By 9 Wickets, Check Score Details - Sakshi
Sakshi News home page

టీమిండియా బౌలర్ల విజృంభణ.. 37 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి

Oct 10 2022 4:06 PM | Updated on Oct 10 2022 5:56 PM

Womens Asia Cup T20 2022: India Beat Thailand By 9 Wickets - Sakshi

Womens Asia Cup T20 2022: మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నీలో భాగంగా పసికూన థాయ్‌లాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 10) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి ధాటికి ప్రత్యర్ధి చిగురుటాకులా వణికిపోయింది. 15.1 ఓవర్లు ఆడిన థాయ్‌ జట్టు కేవలం 37 పరుగులకే కుప్పకూలింది. ఆతర్వాత భారత్‌ కేవలం 6 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తిప్పేసిన స్పిన్నర్లు..
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. స్పిన్నర్లు స్నేహ్‌ రాణా (3/9), రాజేశ్వరీ గైక్వాడ్‌ (2/8), దీప్తి శర్మ (2/10) మాయాజాలం చేయడంతో ప్రత్యర్ధి బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలింది. థాయ్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. మిగిలిన 10 బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యారు. వీరిలో బూచాథమ్‌ అనే బ్యాటర్‌ చేసిన ఏడు పరుగులే అత్యధికం కావడం విశేషం.  

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ సునాయాసంగా విజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (8) తక్కువ స్కోర్‌కే ఔటైనా.. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (20 నాటౌట్‌), వన్‌ డౌన్‌ బ్యాటర్‌ పూజా వస్త్రాకర్‌ (12 నాటౌట్‌) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.  ఈ విజయంతో భారత్‌ టేబుల్‌ టాపర్‌గా (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు (పాక్‌ చేతిలో ఓటమి)) దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు అక్టోబర్‌ 13న జరుగనున్నాయి. సెమీస్‌ రేసులో తొలి మూడు బెర్తులు (భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక) ఇప్పటికే కన్ఫర్మ్‌ కాగా.. నాలుగో స్థానం కోసం బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌ జట్లు పోటీపడుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement