Wimbledon 2021: సానియా జోడీ శుభారంభం

Wimbledon: Sania Mirza And Bethanie Mattek Sands Win In Straight Sets In 1st Round - Sakshi

లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా శుభారంభం చేసింది. నాలుగేళ్ల తర్వాత ఈ టోర్నీ బరిలోకి దిగిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. అమెరికా ప్లేయర్ బెతాని మ్యాటెక్‌ సాండ్స్‌తో కలిసి అద్భుత విజయం సాధించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా- బెతాని జోడీ 7-5, 6-3 తేడాతో ఆరో సీడ్ అలెక్సా గౌరచి(చిలీ)- డిసారియ క్రాక్‌జిక్(అమెరికా) జోడీపై వరుస సెట్లలో గెలుపొందింది.

గంటా 28 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ అలవోకగా విజయాన్నందుకుంది. సానియా కెరీర్‌లో ఇది 121 విజయం కాగా.. ఈ మ్యాచ్‌లో ఆమె ఒక్క ఏస్ మాత్రమే సంధించింది. సానియా.. వింబుల్డన్‌లో 2017లో చివరిసారిగా బరిలోకి దిగింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న ఈ మెగా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సానియాకు చాలా కీలకంగా మారింది. 

కెరీర్ చరమాంకంలో ఉన్న 34 ఏళ్ల సానియా.. ఈ వింబుల్డన్‌లో ఎలాగైనా విజయం సాధించి విశ్వక్రీడల బరిలో నిలవాలని ప్లాన్‌ చేస్తుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ద్వారా భారత్​తరఫున నాలుగు ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించనుంది. ఇదిలా ఉంటే, 2018లో ఇజాన్‌కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్​గెలిచి సెకండ్​ఇన్నింగ్స్​ఘనంగా ప్రారంభించిన ఈ పాక్‌ కోడలు.. ఆతర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top