WC 2022: ఇంగ్లండ్‌ జట్టు ప్రమాదకరమైంది.. మేం గెలవాలంటే: రోహిత్‌ శర్మ | Sakshi
Sakshi News home page

Rohit Sharma- Jos Buttler: ఇంగ్లండ్‌ జట్టు ప్రమాదకరమైంది.. మేం గెలవాలంటే!

Published Thu, Nov 10 2022 11:52 AM

WC 2022 Semi Final Ind Vs Eng: Rohit Buttler Comments Ahead Big Clash - Sakshi

ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final: ‘‘నాకౌట్‌ మ్యాచ్‌కు ప్రాధాన్యత ఉందనేది వాస్తవమే అయినా అలాంటి ఒక్క మ్యాచ్‌లో ప్రదర్శన ఏ ఆటగాడినీ తక్కువ చేయదు. అది నేనైనా, మరో ఆటగాడైనా సరే. తమ సుదీర్ఘ కెరీర్‌లో దేశం తరఫున వారు ఎలా ఆడారనేది ముఖ్యం. ఎవరైనా ఇలాంటి సమయంలో బాగా ఆడేందుకే ఎంతో శ్రమిస్తారు. కానీ ఫలితం ప్రతికూలంగా వచ్చినా గత కొన్నేళ్లుగా వారు చూపిన ఆటను మరిచిపోవద్దు.

బాగా ఆడి లీగ్‌ దశ దాటాం. సెమీస్‌ కూడా మరో దశ. గెలిచి మూడో దశ (ఫైనల్‌)లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తాం. ఇంగ్లండ్‌ జట్టు చాలా ప్రమాదకరమైంది. మేం గెలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది’’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌-2022 రెండో సెమీ ఫైనల్లో భాగంగా భారత జట్టు గురువారం (నవంబరు 10) ఇంగ్లండ్‌తో తలపడనుంది. అడిలైడ్‌ వేదికగా బట్లర్‌ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది.

కాగా రోహిత్‌ శర్మ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. బ్యాటింగ్‌లో అదనపు బలమంటూ స్పిన్‌ ఆల్‌రౌండర్లు అశ్విన్, అక్షర్‌లను ఆడించడం ఆశించిన మేర ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

‘బ్యాటర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అని చెప్పొచ్చు..
ఇక ఇంగ్లండ్‌ సారథి జోస్‌ బట్లర్‌ మాట్లాడుతూ.. ‘‘సూర్యకుమార్‌ కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అతణ్ని ‘బ్యాటర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అని చెప్పవచ్చు. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యను అవుట్‌ చేసేందుకు ఒక్క మంచి బంతి చాలు. సూర్యను ఎలా అవుట్‌ చేయాలనే దానిపై ఆలోచిస్తాం. అయితే కేవలం సూర్యకుమార్‌ గురించి మాత్రమే మేము ఆలోచించడంలేదు. సూర్యతోపాటు ఇతర ఆటగాళ్లు కూడా ప్రమాదకరమే.

భువనేశ్వర్‌తోపాటు ఏ బౌలర్‌కూ నేను భయపడను. ఏ బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలో పకడ్బందీగా సిద్ధమయ్యే క్రీజులోకి వస్తా. మా జట్టులో చాలామందికి అడిలైడ్‌ మైదానంలో ఆడిన అనుభవం ఉంది. మైదానం కొలతలను బట్టి మా వ్యూహంలోనూ మార్పులు చేసుకుంటాం.

పిచ్‌ గురించి పెద్దగా ఆందోళన చెందడంలేదు. భారత జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. టీమిండియాను ఏమాత్రం తక్కువ అంచనా వేయడంలేదు. ముందుగా బ్యాటింగ్‌ చేస్తే భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తాం. ఛేజింగ్‌కు దిగితే ఎంతటి లక్ష్యాన్నైనా అధిగమిస్తామన్న నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: T20 WC 2022 IND VS ENG: సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు..? రద్దయితే ఫైనల్‌కు టీమిండియా
T20 WC 2022: ఓటమి బాధలో ఉన్న కేన్‌ మామకు మరో భారీ షాక్‌..!

Advertisement
Advertisement