నెంబర్‌ వన్‌ కోహ్లి.. రెండో స్థానంలో రోహిత్‌

Virat Kohli Was In Top Position In 2020 ODI Rankings Announced By ICC - Sakshi

దుబాయ్‌ : 2020 ఏడాది ముగింపు సందర్భంగా గురువారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఆసీస్‌ టూర్‌లో రెండు హాఫ్‌ సెంచరీలతో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 870 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. గాయం కారణంగా ఆసీస్‌ టూర్‌కు దూరంగా ఉ‍న్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ 842 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల మధ్య 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. (చదవండి : అందుకే హార్దిక్‌ను వద్దనుకున్నాం: కోహ్లి)

బాబర్‌​ అజమ్‌(837), రాస్‌ టేలర్‌(818), ఆరోన్‌ ఫించ్‌(791) పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించి జోరు కనబర్చిన ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ చాలారోజుల తర్వాత టాప్‌ 20లోకి అడుగుపెట్టగా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా టాప్‌ 20లో చోటు సంపాదించాడు. ఇక ఆసీస్‌ టూర్‌లో బ్యాటింగ్‌లో ఇరగదీసిన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 555 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచి బ్యాటింగ్‌లో కెరీర్‌ బెస్ట్‌ చేరుకున్నాడు.

ఇక బౌలింగ్‌ విభాగానికి వస్తే న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ 722 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. బంగ్లాదేశ్‌ బౌలర్‌ ముజీబుర్‌ రెహమాన్‌ 701 పాయింట్లతో రెండో స్థానం.. టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 700 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌ విభాగంలో టాప్‌ 10లో బుమ్రా మినహా టీమిండియా నుంచి ఒక్క బౌలర్‌ కూడా లేడు. ఇక ఆసీస్‌కు చెందిన హాజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌లు ఆరు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.(చదవండి : టీమిండియాకు మరో షాక్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top