శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనుకున్న భారత జట్టుకు నిరాశే ఎదురైంది. కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టును టీమిండియా డ్రా ముగించింది. ఐదో రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్లు అద్భుతమైన పోరాటం కనబరిచారు. నాలుగో రోజే శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. చివరి రోజున మిగిలిన 4 వికెట్లు సాధించి ఆలౌట్ చేయలేకపోయారు.
యువ ఆటగాడు సోనల్ దినుష (264 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 133 నాటౌట్), లంక టెయిలాండర్ల పోరాటం ముందు మన బౌలర్లు తేలిపోయారు. దీంతో శ్రీలంక 429/9 స్కోరు వద్ద ఉన్నప్పుడు మ్యాచ్ను డ్రాగా ముగించారు. అయితే ఈ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో టీమిండియా ఫైనల్ ఆశలపై ప్రభావం చూపింది.
ఈ మ్యాచ్లో భారత్ గెలిచి ఉంటే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి చేరుకునేది. కానీ ఇప్పుడు డ్రా కావడంతో ఐదో స్ధానానికే పరిమితమైంది. అంతేకాకుండా విజయాల శాతం 53.33 నుంచి 51.52కి పడిపోయింది. ప్రస్తుత సైకిల్లో గిల్ సేన ఇప్పటివరకు ఆడిన 11 టెస్టుల్లో ఐదు విజయాలు, రెండు డ్రాలు చేసింది. మరో నాలుగు మ్యాచ్లలో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (80), దక్షిణాఫ్రికా (75), న్యూజిలాండ్ (72.22), బంగ్లాదేశ్ (55.56) జట్లు భారత్ కంటే ముందున్నాయి.
భారత్ ఫైనల్కు చేరాలంటే?
ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇంకా 7 టెస్టులు ఆడనుంది. ఇందుకు న్యూజిలాండ్తో 2, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లలో తలపడనుంది. భారత జట్టు ఫైనల్కు చేరాలంటే.. ఈ ఏడు మ్యాచ్లలో ఐదింట అయినా గెలుపొందాలి. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపైన కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్లో కివీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది.
చదవండి: IND vs SL: 90 బంతులు.. 12 పరుగులు! నీ ఓపికకు ఓ దండం సామీ?


