నమ్మశక్యంకాని రీతిలో మ్యాచ్‌ను గెలిపించిన వరుణ్‌ చక్రవర్తి.. భావోద్వేగానికి లోనైన అశ్విన్‌ | TNPL 2025: Varun Chakravarthy Hits Six And Four Off Last 2 Balls To Lead Dindigul Dragons To Victory | Sakshi
Sakshi News home page

నమ్మశక్యంకాని రీతిలో మ్యాచ్‌ను గెలిపించిన వరుణ్‌ చక్రవర్తి.. భావోద్వేగానికి లోనైన అశ్విన్‌

Jun 23 2025 5:39 PM | Updated on Jun 23 2025 6:25 PM

TNPL 2025: Varun Chakravarthy Hits Six And Four Off Last 2 Balls To Lead Dindigul Dragons To Victory

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బ్యాటర్‌గా చెలరేగిపోయాడు. లక్ష్య ఛేదనలో చివరి 2 బంతుల్లో 7 పరుగులు అవసరమైనప్పుడు.. వరుసగా సిక్సర్‌, బౌండరీ కొట్టి తన జట్టును గెలిపించాడు. 

వరుణ్‌ మ్యాచ్‌ను గెలిపించాక, అతని జట్టు కెప్టెన్‌, టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. కాసేపు తల వంచుకొని అలాగే ఉండిపోయాడు. అనంతరం వరుణ్‌ను అభినందించేందుకు గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2025లో భాగంగా దిండిగుల్‌ డ్రాగన్స్‌, సేలమ్‌ స్పార్టన్స్‌ జట్లు నిన్న (జూన్‌ 22) తలపడ్డాయి. ఈ లీగ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ దిండిగుల్‌ డ్రాగన్స్‌కు సారథ్యం వహిస్తుండగా.. వరుణ్‌ చక్రవర్తి ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్పార్టన్స్‌.. నిధీశ్‌ రాజగోపాల్‌ (47 బంతుల్లో 74) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. స్పార్టన్స్‌ ఇన్నింగ్స్‌లో రాజేంద్రన్‌ (35), సన్నీ సంధు (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్పార్టన్స్‌ను అశ్విన్‌ అద్బుతమైన బౌలింగ్‌తో దెబ్బకొట్టాడు. అశ్విన్‌ తన కోటా 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం​ 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సందీప్‌ వారియర్‌, కార్తీక్‌ శరణ్‌, వరుణ్‌ చక్రవర్తి తలో వికెట్‌ తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనలో డ్రాగన్స్‌ను అశ్విన్‌ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ లీగ్‌లో ఆది నుంచి ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న అశ్విన్‌ నిన్నటి మ్యాచ్‌లో 14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. అశ్విన్‌ ఔటయ్యాక కాస్త తడబడిన డ్రాగన్స్‌ను శివమ్‌ సింగ్‌ (34), జయంత్‌ (25), హన్నీ సైనీ (35), విమల్‌ కుమార్‌ (24) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వికెట్లు పడుతున్నా వీరు డ్రాగన్స్‌ను గెలుపు ట్రాక్‌లోనే ఉంచారు. 

తొమ్మిదో స్థానంలో వరుణ్‌ చక్రవర్తి బ్యాటింగ్‌కు దిగే సమయానికి డ్రాగన్స​ గెలుపుకు 11 బంతుల్లో 20 పరుగులు అవసరంగా ఉన్నాయి. ఈ దశలో బ్యాట్‌కు పని చెప్పిన వరుణ్‌, నమ్మశ్యంకాని రీతిలో 5 బంతుల్లో 13 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. చివరి 2 బంతుల్లో 7 పరుగులు అవసరమైన తరుణంలో వరుణ్‌ వరుసగా సిక్సర్‌, బౌండరీ కొట్టి గెలిపించిన వైనం మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.   తొలుత బంతితో, ఆ తర్వాత బ్యాట్‌తో ఇరగదీసిన అశ్విన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement