
ఐపీఎల్ 2025 తర్వాత తొలి మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. నిన్న (జూన్ 4) మొదలైన టీ20 ముంబై లీగ్లో ట్రయంప్ నైట్స్ ఫ్రాంచైజీకి సారథ్యం వహిస్తున్న స్కై.. ఈగల్ థానే స్ట్రయికర్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 25 బంతుల్లోనే 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన అర్ద సెంచరీతో అలరించాడు. ఈ మ్యాచ్లో స్కై సత్తా చాటినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రయంప్ నైట్స్ ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్స్.. స్కై రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నైట్స్ ఇన్నింగ్స్లో సురేంద్ర రాణా (53) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో పరిక్షిత్ 29, సంజయ్ జైన్ 24, సూర్యాంశ్ షేడ్గే 8, సిద్దాంత్ 4 పరుగులు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో అమిత్ పాండే, హర్ష్ తన్నా, శశాంక్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన స్ట్రయికర్స్.. సాయిరాజ్ పాటిల్ (22 బంతుల్లో 47 నాటౌట్), వరుణ్ లవండే (38 బంతుల్లో 57) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్లో అనిష్ ముకుంద్ (37) కూడా రాణించాడు. నైట్స్ బౌలర్లలో మినాద్ మంజ్రేకర్ 2,సూర్యకాంత్ పవార్, భరత్ పాటిల్, పరిక్షిత్ తలో వికెట్ తీశారు.
కాగా, తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025లో సూర్యకుమార్ యాదవ్ అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (ప్లేయర్ ఆఫ్ ద సిరీస్) గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో స్కై 16 మ్యాచ్ల్లో 65.18 సగటున 5 అర్ద సెంచరీల సాయంతో 717 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
ఈ సీజన్లో స్కై ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఆరంభంలో పరాజయాలు ఎదుర్కొన్నా, ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకొని క్వాలిఫయర్-2 వరకు చేరింది. అయితే ఆ మ్యాచ్లో ముంబై పంజాబ్ చేతిలో ఓటమిపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ముంబై పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.