సన్‌రైజర్స్‌ అదుర్స్‌.. భారీ విజయం

SRH Beat Kings Punjab By 69 Runs - Sakshi

దుబాయ్‌: కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదుర్స్‌ అనిపించింది. కింగ్స్‌ పంజాబ్‌ను 16.5 ఓవర్లలోనే 132 పరుగులకే ఆలౌట్‌ చేసి భారీ విజయాన్ని సాధించింది. కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాళ్లలో నికోలస్‌ పూరన్‌(77; 37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో 69 పరుగుల తేడాతో ఘోర పరాజయం చెందింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు సాధించగా, ఖలీల్‌ అహ్మద్‌, నటరాజన్‌ తలో రెండు వికెట్లు సాధించారు. అభిషేక్‌ శర్మకు వికెట్‌ లభించింది. మరో ఇద్దరు కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాళ్లు రనౌట్‌ అయ్యారు.

ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(9), ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు సిమ్రాన్‌ సింగ్‌(11)ల వికెట్లను ఆదిలోనే కింగ్స్‌ పంజాబ్‌ కోల్పోగా ఆ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన పూరన్‌ బ్యాట్‌కు పనిచెప్పాడు. వరుస సిక్స్‌లతో దుమ్మురేపాడు. అభిషేక్‌ శర్మ వేసిన ఏడో ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన పూరన్‌.. అబ్దుల్‌ సామద్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌ కొట్టాడు. అందులో హ్యాట్రిక్‌ సిక్స్‌లు సాధించాడు పూరన్‌. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకుని ఈ సీజన్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. పూరన్‌కు మిగతా వారి నుంచి సరైన మద్దతు లభించలేదు. పూరన్‌ ఏడో వికెట్‌గా రషీద్‌ ఔట్‌ చేసిన కాసేపటికి కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇది కింగ్స్‌ పంజాబ్‌కు ఐదో ఓటమి కాగా, ఎస్‌ఆర్‌హెచ్‌కు మూడో విజయం. (చదవండి; పూరన్‌ ఫాస్టెస్ట్‌ రికార్డు)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డేవిడ్‌ వార్నర్‌(52; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌), బెయిర్‌ స్టో(97; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు)లు రాణించడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోరును చేయకల్గింది.పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి సన్‌రైజర్స్‌ ముందుగా బ్యాటింగ్‌ తీసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ను వార్నర్‌, బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లను ఆడేసుకుంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తొలుత బెయిర్‌ స్టో హాఫ్‌ సెంచరీ సాధించగా, కాసేపటికి వార్నర్‌ అర్థ శతకం సాధించాడు. గత మ్యాచ్‌లకు భిన్నంగా బెయిర్‌ స్టో బ్యాట్‌ ఝుళిపించాడు. 

పంజాబ్‌ యువ బౌలర్లను టార్గెట్‌ చేస్తూ రెచ్చిపోయి ఆడాడు. అతనికి జతగా వార్నర్‌ స్టైక్‌ రొటేట్‌ చేస్తూ స్కోరు బోర్డుపై రన్‌రేట్‌ తగ్గకుండా చూసుకున్నారు. కాగా, వార్నర్‌ అర్థ శతకం సాధించిన తర్వాత తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో ఆరెంజ్‌ ఆర్మీ 160 పరుగుల వద్ద తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై బెయిర్‌ స్టో సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. వార్నర్‌, బెయిర్‌ స్టోలను రవి బిష్ణోయ్‌ పెవిలియన్‌కు పంపాడు. మనీష్‌ పాండే(1) కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అర్షదీప్‌ దీప్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అబ్దుల్‌ సామద్‌(8), ప్రియాం గార్గ్‌(0)లు కూడా స్వల్య వ్యవధిలోనే ఔటయ్యారు. 15 పరుగుల వ్యవధిలో సన్‌రైజర్స్‌ ఐదు వికెట్లను కోల్పోవడంతో రెండొందల పరుగుల మార్కును చేరడం కష్టమనిపించింది. కానీ కేన్‌ విలియమ్సన్‌ (20 నాటౌట్‌; 10 బంతుల్లో 1 ఫోర్‌ 1సిక్స్‌, అభిషేక్‌ శర్మ(12;  6 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌)లు చివర్లో బ్యాట్‌ ఝుళిపించడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ మూడు వికెట్లు సాధించగా, అర్షదీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్‌ షమీకి వికెట్‌ లభించింది.(చదవండి: కింగ్స్‌ పంజాబ్‌పై వరుసగా 9వసారి..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top