రాజ్కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఏతో ఇవాళ (నవంబర్ 19) జరిగిన మూడో వన్డేలో భారత-ఏ జట్టుకు భంగపాటు ఎదురైంది. ఈ మ్యాచ్లో భారత యువ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ఫలితంగా పర్యాటకుల చేతిలో 73 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.
ఇది వరకే సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికాకు ఇది కంటితుడుపు విజయం. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.
ఓపెనర్ల శతకాలు
టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ (325/6) చేసింది. ఓపెనర్లు లూహాన్ డ్రి ప్రిటోరియస్ (123), రివాల్లో మూన్సామి (107) అద్బుత శతకాలు సాధించారు. వీరిద్దరు ఔటయ్యాక సౌతాఫ్రికా స్కోర్ నెమ్మదించింది.
ఆతర్వాత వచ్చిన రుబిన్ హెర్మన్ (11), క్వెషైల్ (1), కెప్టెన్ ఆకెర్మన్ (16), డియాన్ ఫార్రెస్టర్ (20) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వీరంతా కూడా రాణించి ఉంటే సౌతాఫ్రికా ఇంకాస్త భారీ స్కోర్ చేసేది. ఆఖర్లో డెలానో పాట్గెటర్ (30 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికా స్కోర్ను 300 మార్కు దాటించాడు.
ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ 10 ఓవర్లలో 82 పరుగులిచ్చాడు (2 వికెట్లు). హర్షిత్ రాణా (10-1-47-2), ప్రసిద్ద్ కృష్ణ (10-0-52-2) సౌతాఫ్రికా బ్యాటర్లను కాస్త నిలువరించగలిగారు.
టాపార్డర్ వైఫల్యం
326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (25) సహా టాపార్డర్ అంతా దారుణంగా విఫలమైంది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ తిలక్ వర్మ తలో 11, రియాన్ పరాగ్ 17 పరుగులు చేసి ఔటయ్యారు.
ఆతర్వాత ఇషాన్ కిషన్ (53), ఆయుశ్ బదోని (66) కాసేపు పోరాడారు. అయితే అప్పటికే భారత ఓటమి ఖరారైపోయింది. నకాబా పీటర్ (10-0-48-4), మొరేకి (9.1-0-58-3), ఫోర్టుయిన్ (10-0-48-2) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను 252 పరుగులకే కట్టడి చేశారు.


