
టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యధిక వేగంగా 500 పరుగులు సాధించిన భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 3 పరుగుల చేసిన గిల్.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
గిల్ 10 ఇన్నింగ్స్లో 500 పరుగుల మార్క్ను అందుకున్నాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉండేది. సిద్దూ 11 ఇన్నింగ్స్లలో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్తో సిద్దూ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి వన్డేలో ప్రోటీస్ చేతిలో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
వర్షం కారణంగా మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో మిల్లర్(74 నటౌట్), క్లాసెన్(74) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 240 పరుగులకు పరిమితమైంది. టీమిండియా బ్యాటర్లలో సంజూ శాంసన్(86) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
చదవండి: IND vs SA: 'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం! సంజూ గ్రేట్'