Team India Head Coach: టీమిండియా కోచ్‌ పదవి వద్దన్న లంక మాజీ క్రికెటర్‌!

Report Says Mahela Jayawardene Rejects Team Indias Head Coach Offer - Sakshi

ముంబై: టి20 ప్రపంచకప్‌ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి రవిశాస్త్రి రాజీనామా చేయనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ కొత్త కోచ్‌కు సంబంధించి వెతుకులాట మొదలుపెట్టిందని సమాచారం. దీనికి అనుగుణంగానే కోచ్‌ పదవికి సంబంధించి రోజుకో పేరు బయటికి వస్తుంది. తొలుత ద్రవిడ్‌, సెహ్వాగ్‌లలో ఎవరు ఒకరు కోచ్‌ పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కుంబ్లే, లక్ష్మణ్‌ పేర్లు కూడా వినిపించాయి. తాజాగా బీసీసీఐ శ్రీలంక మాజీ క్రికెటర్‌ మహేళ జయవర్దనేకు కోచ్‌ పదవి ఆఫర్‌ కోసం సంపద్రించినట్లు రిపోర్ట్స్‌ ద్వారా సమాచారం అందింది. అయితే జయవర్దనే బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. రిపోర్ట్స్‌ ప్రకారం.. టీమిండియా కోచ్‌ పదవిపై జయవర్దనేకు ఆసక్తి లేదట. అంతేగాక అతను ప్రస్తుతం శ్రీలంక అండర్‌-19 క్రికెట్‌ టీమ్‌కు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా కోచ్‌ కంటే శ్రీలంక ప్రధానకోచ్‌గా ఉండేదుకు ఇష్టపడుతున్నట్లు సమాచారం.

చదవండి: Team India Head Coach: టీమిండియా ప్రధాన కోచ్‌గా మరోసారి ఆయనే!

ఇక జయవర్దనే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో 2017 నుంచి ముంబై ఇండియన్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జయవర్దనే కోచ్‌గా 2017, 2019లో ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ రూల్స్‌ ప్రకారం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉండాలంటే ఏ జట్టుకు కోచ్‌గా కొనసాగకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్‌ జయవర్దనేను వదులుకోవడానికి ఇష్టపడదు. అందులోనూ శ్రీలంక క్రికెట్‌లో ఇలాంటి రూల్స్‌ లేవు. ఒక రకంగా జయవర్దనే టీమిండియా కోచ్‌ పదవి వద్దనడానికి ఇది కూడా ఒక కారణంగా భావించొచ్చు. అయితే ఇప్పటికైతే జయవర్దనే బీసీసీఐకి తెలిపిన  విషయంలో క్లారిటీ లేదు. టి 20 ప్రపంచకప్‌ తర్వతే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం లభిస్తుంది.

ఇక జయవర్దనే లంక దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరు పొందాడు. బ్యాట్స్‌మన్‌గా... కెప్టెన్‌గా లంక జట్టుకు లెక్కలేనన్ని విజయాలు అందించాడు. లంక తరపున 448 వన్డేల్లో 12560 పరుగులు, 149 టెస్టు మ్యాచ్‌ల్లో 11814 పరుగులు, 55 టి20 మ్యాచ్‌ల్లో 1493 పరుగులు చేశాడు. జయవర్దనే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 54 సెంచరీలు చేశాడు. దీనితో పాటు ఏడు డబుల్‌ సెంచరీలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో 80 మ్యాచ్‌లాడిన జయవర్దనే 1802 పరుగులు చేశాడు.

చదవండి: Virat Kohli: కోహ్లి నిర్ణయం సరైందే.. తను వరల్డ్‌కప్‌ గెలవాలి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top