
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించే నితీశ్ రాణా.. రానున్న దేశవాలీ సీజన్ (2025-26) కోసం జట్టు మారనున్నాడు. రెండేళ్ల క్రితమే ఢిల్లీ నుంచి ఉత్తర్ప్రదేశ్కు మకాం మార్చిన నితీశ్ తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు దేశీయ క్రికెట్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతుంది. నితీశ్కు అత్యంత సన్నితంగా వ్యవహరించే ఓ వ్యక్తి (చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్) ఈ విషయాన్ని ధృవీకరించాడు. తదుపరి సీజన్లో నితీశ్ ఢిల్లీ తరఫున ఆడతాడని అతను చెప్పాడు.
31 ఏళ్ల నితీశ్ 2023-24 సీజన్కు ముందు ఢిల్లీని వీడి ఉత్తర్ప్రదేశ్కు వలస వెళ్లాడు. గతంలో నితీశ్ ఢిల్లీకి కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. యూపీ తరఫున నితీశ్ పెద్దగా రాణించలేకపోయాడు. గత సీజన్లో అతను అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 9 మ్యాచ్ల్లో 111 పరుగులు.. విజయ్ హజారే ట్రోఫీలో 2 మ్యాచ్ల్లో 17 పరుగులు.. రంజీ ట్రోఫీలో 4 మ్యాచ్ల్లో 150 పరుగులు మాత్రమే చేశాడు.
పేలవ ప్రదర్శనల కారణంగా నితీశ్ యూపీ జట్టులో స్థానం కోసం పాకులాడాల్సి వచ్చేది. ఎవరైనా మిడిలార్డర్ బ్యాటర్ గాయపడితేనే నితీశ్కు అవకాశాలు వచ్చేవి. దీంతో ఉపయోగం లేదని అనుకున్న నితీశ్ సొంతగూటికి తిరిగి రావడానికి సిద్దమయ్యాడు.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నితీశ్కు ఢిల్లీ జట్టులో గతంలోలా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పేలవ ఫామ్, జట్టును అకారణంగా వీడాడన్న కారణాల చేత ఢిల్లీ యాజమాన్యం నితీశ్ను గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఓ వ్యక్తి నితీశ్ను ఉద్దేశిస్తూ.. ఇదేమీ డంప్ యార్డ్ కాదని సంచలన కామెంట్లు చేశాడు.
దీన్ని బట్టి చూస్తే నితీశ్ ఢిల్లీ జట్టులో చేరినా అతని కెరీర్ నల్లేరుపై నడకలా ఉండకపోవచ్చు. నితీశ్ త్వరలో జరుగున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ దేశీయ లీగ్లో అతను సత్తా చాటగలిగితే ఢిల్లీ దేశవాలీ జట్టులో పూర్వవైభవం సాధించవచ్చు.
నితీశ్ వర్సెస్ ఢిల్లీ కెప్టెన్
ఒకవేళ నితీశ్ ఢిల్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా అతని పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నితీశ్ ఢిల్లీ సారధి ఆయుశ్ బదోనితో గొడవపడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా నితీశ్, బదోని బాహాబాహీకి దిగినంత పని చేశారు. ఆ సమయంలో అంపైర్లు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
ఐపీఎల్లోనూ అదే ప్రదర్శన
నితీశ్ తాజాగా ముగిసిన ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శనను కొనసాగించాడు. ఈ సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను సామర్థ్యం మేరకు రాణించలేకపోయాడు. 11 ఇన్నింగ్స్ల్లో కేవలం 217 పరుగులు మాత్రమే చేశాడు.