
నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. జావెలిన్ విసరడానికి ముందు నా రనప్ వేగంగా ఉంది. దాన్ని అదుపు చేయలేకపోయా. అయినా ఫలితం ఆనందాన్నిచి్చంది. మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఓ్రస్టావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్ మీట్లో పాల్గొననున్నా. అందుకే కాస్త విశ్రాంతి అవసరం. 90 మీటర్ల మార్క్ దాటిన తర్వాత సగం ఒత్తిడి దూరమైనట్లు అనిపించింది. ఇక నిలకడగా అదే దూరాన్ని కొనసాగించడంపై దృష్టి పెడతా. అయితే పోటీ జరిగే రోజు పరిస్థితులు, వాతావరణం, శరీర తీరును బట్టి ప్రదర్శనలో మార్పులు రావడం సహజం. అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా 90 మీటర్ల దూరాన్ని కొనసాగించాలంటే మరింత దృఢంగా ఉండాలి. దాని కోసం సాధన కొనసాగిస్తా. జావెలిన్ విసిరే సమయంలో నియంత్రణ ముఖ్యం. శిక్షణ సమయంలో దానిపై దృష్టి సారిస్తా. ప్రదర్శనలో చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరముంది. ఈ సీజన్లో మరిన్ని పోటీల్లో పాల్గొననున్నా. అందుకే నిలకడగా మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నా. టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకం సాధించినప్పటి నుంచి దేశంలో జావెలిన్ త్రోకు ఆదరణ మరింత పెరిగింది. ఇప్పుడు నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ నిర్వహిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇది మరింత పెద్ద స్థాయికి చేరడం ఖాయం. -నీరజ్ చోప్రా
పారిస్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ మీట్లో నీరజ్ జావెలిన్ను 88.16 మీటర్ల దూరం అగ్ర స్థానంలో నిలిచాడు. రెండేళ్లలో నీరజ్కు ఇదే తొలి డైమండ్ లీగ్ టైటిల్ కాగా... 90 మీటర్ల మార్క్ దాటకుండానే భారత స్టార్ నంబర్వన్గా నిలవడం విశేషం. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 87.88 మీటర్ల దూరంతో రెండో స్థానంలో నిలిచాడు. బ్రెజిల్కు చెందిన లూయిజ్ మారిసియో డా సిల్వా 86.62 మీటర్ల దూరంతో మూడో స్థానం దక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన నీరజ్... ఆ తర్వాత రెండో ప్రయత్నంలో జావెలిన్ను 85.10 మీటర్లు విసిరాడు... ఆ తర్వాత మూడు సార్లు ఫౌల్ చేసిన భారత అథ్లెట్... ఆఖరి ప్రయత్నంలో 82.89 మీటర్ల దూరం నమోదు చేసుకున్నాడు. కేషార్న్ వాల్కాట్ (81.66 మీటర్లు; ట్రినిడాడ్, టొబాగో) నాలుగో స్థానం దక్కించుకోగా... రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (80.29 మీటర్లు; గ్రెనడా), జూలియన్ యోగో (80.26 మీటర్లు; కెన్యా) వరుసగా ఐదో, ఆరో స్థానాల్లో నిలిచారు.
సీజన్లో తొలి టైటిల్...
భారత అథ్లెటిక్స్ గతిని మార్చిన నీరజ్ ఈ సీజన్లో తొలి టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. చివరిసారిగా 2023లో లుసానే డైమండ్ లీగ్లో విజేతగా నిలిచిన నీరజ్... ఆ తర్వాత ఈ రెండేళ్లలో బరిలోకి దిగిన ఆరు డైమండ్ లీగ్ల్లో రెండో స్థానానికే పరిమితమయ్యాడు. పారిస్ డైమిండ్ లీగ్లో చివరిసారిగా 2017లో పోటీపడిన నీరజ్... జూనియర్ ప్రపంచ చాంపియన్గా బరిలోకి దిగి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన భారత జావెలిన్ త్రోయర్... 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకున్నాడు. గత నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్లో 90 మీటర్ల మార్క్ దాటిన ఈ హర్యానా త్రోయర్... దూరంతో పాటు
ఫిట్నెస్పై కూడా దృష్టి పెట్టాడు. ఈ నెల 24 నుంచి జరగనున్న గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్ మీట్లో పాల్గొననున్న 27 ఏళ్ల నీరజ్... ఆ తర్వాత భారత్లో తొలిసారి నిర్వహిస్తున్న అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్‘లో పాల్గొననున్నాడు. బెంగళూరు వేదికగా వచ్చే నెల 5న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపునిచ్చింది.