
సాక్షి, చెన్నై(తమిళనాడు): వచ్చే నెలలో ఆరంభం కానున్న టోక్యో ఒలింపిక్స్లో పోటీ చేసే భారతీయ క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం వెల్లడించారు. సిల్వర్ పతక విజేతకు రెండు కోట్లు, అలానే కాంస్య పతక విజేతకు ఒక కోటి ఇవ్వనున్నట్లు తమిళనాడు సీఎం తెలిపారు. స్థానిక నెహ్రు స్టెడియంలో క్రీడాకారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గోన్న స్టాలిన్ ఈ ప్రకటనలు చేశారు . ప్రభుత్వం ఎప్పడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, కరణం మల్లేశ్వరి, పిటి.ఉష వాళ్ల రంగాల్లో సత్తా చాటారని, వాళ్లను ఆదర్శంగా తీసుకువాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదాపడి.. ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.14 క్రీడా విభాగాలకు మొత్తం 102 మంది భారతీయ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ కోసం అర్హత సాధించారు.
చదవండి: డెల్టా దాడి.. ఈసారి టీ 20 ప్రపంచ కప్ విదేశాల్లో..?