కంటతడి పెట్టిన లియోనల్‌ మెస్సీ! | Lionel Messi Tears After Plays Final Match At Home Ground For Argentina | Sakshi
Sakshi News home page

Lionel Messi: సొంతగడ్డపై చివరి మ్యాచ్‌.. మెస్సీ కంటతడి!

Apr 1 2026 1:22 PM | Updated on Apr 1 2026 1:40 PM

Lionel Messi Tears After Plays Final Match At Home Ground For Argentina

లియోన‌ల్ మెస్సీ.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఈతరం ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఆల్ టైమ్ గ్రేట్‌గా ఈ అర్జెంటీనా స్టార్‌ను అభివర్ణిస్తుంటారు. ఆయన అభిమాన బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం మెస్సీ వయస్సు 38 ఏళ్లు కావడంతో అతడి రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 

జూన్‌లో మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్ 2026 మెస్సీ ఆఖరి టోర్నీ అని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడడంతో మెస్సీ ఉద్వేగానికి గురయ్యాడు. విషయంలోకి వెళితే మంగళవారం రాత్రి బ్యూనస్ఎయిర్స్ వేదికగా అర్జెంటీనా, జాంబియా మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఒక గోల్ కొట్టడంతో పాటు మరొక గోల్ కొట్టడంలో అసిస్ట్ చేశాడు. 

మ్యాచ్‌లో అర్జెంటీనా 5-0తో జాంబియాను చిత్తుగా ఓడించింది. తొలి హాఫ్ ముగియడానికి ముందు కెరీర్‌లో 116వ గోల్ సాధించిన మెస్సీ అంతకముందు మ్యాచ్ ఆరంభంలో జులియన్ అల్వారెజ్‌కు పాస్ అందించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత తన సహచరులతో కలిసి మైదానంలో నిలబడిన సమయంలో స్టాండ్స్‌లోని ప్రేక్షకులు ‘మెస్సీ.. మెస్సీ’ అంటూ అరవడం మొదలెట్టారు. ఇది చూసిన మెస్సీ కళ్లలో దుఃఖం ఆగలేదు. 

వెంటనే తలను కిందకు దించి కంటి నుంచి వచ్చిన నీరును తుడుచుకోవడం కెమెరాలకు చిక్కింది. అర్జెంటీనా తరఫున తన హోంగ్రౌండ్‌లో చివరి మ్యాచ్ ఆడడాన్ని జీర్ణించుకోలేకే మెస్సీ కంటతడి పెట్టినట్లు అభిమానులు కామెంట్ చేశారు. ఇక ఫిఫా ప్రపంచకప్‌కు ఇప్పటికే అర్హత సాధించిన అర్జెంటీనా గ్రూప్‌-జేలో ఉంది. 

ఇదే గ్రూప్‌లో ఉన్న అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్‌లతో అర్జెంటీనా మ్యాచ్‌లు ఆడనుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న అర్జెంటీనాకు గ్రూప్ దశలో సులువైన డ్రానే లభించింది. ప్రపంచకప్‌కు సన్నాహకంగా అర్జెంటీనా వరుస ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడుతూ వస్తోంది. ఇప్పటికే మారిటానియా, జాంబియాలతో మ్యాచ్‌లు ముగించుకున్న అర్జెంటీనా తమ తదుపరి మ్యాచ్‌ను సెర్బియాతో ఆడనుంది.

2022లో అర్జెంటీనా ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ సాధించ‌డంలో మెస్సీ కీల‌క‌పాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్‌లో నాయకుడిగా, ఆట‌గాడిగా జ‌ట్టును న‌డిపించిన మెస్సీ ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో రెండు గోల్స్ కొట్టడమే గాక, టోర్నీ మొత్తంగా ఏడు గోల్స్ కొట్టి ‘గోల్డెన్ బాల్‌’ అవార్డును సొంతం చేసుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మెస్సీ ఆ జట్టు దిగ్గజ కెప్టెన్లు డానియెల్‌ పసరెల్లా, డీగో మారడోనా సరసన చోటు దక్కించుకున్నాడు. 

2005లో అర్జెంటీనా జాతీయ జట్టులోకి వచ్చిన మెస్సీ ఇప్పటివరకు 198 మ్యాచ్‌ల్లో 116 గోల్స్ సాధించాడు.  చివరగా మెస్సీ సారథ్యంలో 2024లో మినీ ప్రపంచకప్‌గా పిలుచుకునే కోపా అమెరికా కప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది.  తాజాగా మరోసారి కోచ్ లియోనెల్ స్కలోని మార్గదర్శకత్వంలో మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

అయితే ఈ ప్రపంచ కప్‌లో మెస్సికి ఆడాలనే ఉన్నప్పటికీ కోచ్, బోర్డు తీసుకునే నిర్ణయంపై సందిగ్ధం నెలకొంది. ఇక ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఫిఫా వరల్డ్‌కప్ జరగనుంది.

చదవండి: ‘స్నేహితుల్లేరు.. మా నాన్న ఫేవరెట్ క్రికెటర్ కాదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement