ఆదుకున్న గిల్‌, మోర్గాన్‌

KKR Set Target Of 150 Runs Against Kings Punjab - Sakshi

షార్జా: కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ తొలుత ఫీల్డింగ్‌ తీసుకోవడంతో కేకేఆర్‌ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణాలు ఆరంభించారు.కాగా, మ్యాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో రాణా డకౌట్‌ అయ్యాడు. మొదటి ఓవర్‌ రెండో బంతికే రాణా పెవిలియన్‌ చేరాడు.  ఆ తర్వాత ఓవర్‌లో రాహుల్‌ త్రిపాఠి(7), దినేశ్‌ కార్తీక్‌(0)లు ఔటయ్యారు. మహ్మద్‌ షమీ వేసిన రెండో ఓవర్‌ నాల్గో బంతికి త్రిపాఠి ఔట్‌ కాగా, ఆఖరి బంతికి కార్తీక్‌ డకౌట్‌ అయ్యాడు. దాంతో కేకేఆర్‌ 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తరుణంలో గిల్‌కు జత కలిసిన ఇయాన్‌ మోర్గాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 81 పరుగులు చేయడంతో కేకేఆర్‌ తేరుకుంది. మోర్గాన్‌ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. ఆపై నరైన్‌(6),నాగర్‌కోటి(6), కమిన్స్‌(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. ఇక గిల్‌ 45 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లతో  57 పరుగులు సాధించాడు. చివర్లో ఫెర్గ్యూసన్‌(24 నాటౌట్‌; 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, రవి బిష్నోయ్‌,  క్రిస్‌ జోర్డాన్‌ చెరో  రెండు వికెట్లు తీశారు. మురుగన్‌ అశ్విన్‌, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్‌ తీశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top