
టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నాడు. గతేడాదే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్.. ఇవాళ (ఏప్రిల్ 8) బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నాడు. పలు కథనాల ప్రకారం జాదవ్ ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నాడు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే కేదార్ను భాజపాలోకి ఆహ్వానించనున్నాడు. కేదార్ మహా సీఎం ఫడ్నవిస్తో కలిసి దిగిన ఫోటో సోషల్మీడియాలో వైరలవుతుంది.
Former cricketer Kedar Jadhav set to start his political career
Details:👉 https://t.co/2tpIz8m7ju pic.twitter.com/ftEYmpgP3u— CricTracker (@Cricketracker) April 8, 2025
40 ఏళ్ల కేదార్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. కుడి చేతి వాటం బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన అతను భారత్ తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. కేదార్ వన్డేల్లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీల సాయంతో 1389 పరుగులు చేసి 27 వికెట్లు తీశాడు. 9 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 122 పరుగులు చేశాడు. కేదార్ చాలా మ్యాచ్ల్లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2017లో పూణేలో ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో అతను 120 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు.
టీమిండియాకు ఆడకముందే కేదార్ ఐపీఎల్లో మెరిశాడు. వాస్తవానికి ఐపీఎల్ ప్రదర్శనల కారణంగానే అతడికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. కేదార్ 2010లో ఐపీఎల్లోకి ప్రవేశించి వివిధ ఫ్రాంచైజీల తరఫున (కొచ్చి టస్కర్స్ కేరళ, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే, సన్రైజర్స్) 95 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 123.11 స్ట్రయిక్రేట్తో, 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.
కేదార్ దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించేవాడు. అతడిని ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్ ఏ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. మహారాష్ట్ర మిడిలార్డర్లో కేదార్ చాన్నాళ్ల పాటు కీలక సభ్యుడిగా ఉన్నాడు. కేదార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 సెంచరీలు, లిస్ట్-ఏ క్రికెట్లో 9 సెంచరీలు చేశాడు. 2013-14 రంజీ సీజన్ కేదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ సీజన్లో అతను 1000కి పైగా పరుగులు చేయడమే కాకుండా ఓ ట్రిపుల్ సెంచరీ (327) కూడా చేశాడు. కేదార్ 2024 జూన్ 3న క్రికెట్లోని అన్ని ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు.