
ఐపీఎల్ మెగావేలానికి సమయం దగ్గరవుతున్న కొద్ది ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడవుతాడనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న 8 ఫ్రాంచైజీలతో పాటు అదనంగా లక్నో, అహ్మదాబాద్ పేరిట మరో రెండు ఫ్రాంచైజీలు రానున్నాయి. దీంతో రెండు కొత్త ఫ్రాంచైజీలకు కెప్టెన్లుగా ఎవరు అవుతారనేదానిపై చాలా మంది ఎదురుచూస్తున్నారు. కాగా మెగావేలానికి ముందు ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలకు నాన్ రిటైన్ ప్లేయర్స్ జాబితా నుంచి ముగ్గురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 25లోపూ ఈ ప్రక్రియను పూర్తి చేసి ఐపీఎల్ బోర్డుకు వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు మెగావేలంలో ముగ్గురి పేర్లను దాదాపు ఖరారు చేసుకున్నట్లు సమాచారం.
చదవండి: IPL 2022: రూ.100 కోట్లతో సునీల్ నరైన్ సరికొత్త రికార్డు
రిపోర్ట్స్ ప్రకారం పంజాబ్ కింగ్స్ వదిలేసిన కేఎల్ రాహుల్ లక్నో ఫ్రాంచైజీకి కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉండగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి శ్రేయాస్ అయ్యర్కు అవకాశం ఉన్నప్పటికి.. వేలంలో వార్నర్ను దక్కించుకుంటే అతనికి కూడా అవకాశం ఉంది. ఇక కేఎల్ రాహుల్తో పాటు రషీద్ ఖాన్, ఇషాన్ కిషన్లను లక్నో ఫైనలైజ్ చేయగా.. మరోవైపు అహ్మదాబాద్ శ్రేయాస్తో పాటు హార్దిక్ పాండ్యా రెండో ఆటగాడిగా, ఇక మూడో ఆటగాడిగా క్వింటన్ డికాక్ లేదా డేవిడ్ వార్నర్లలో ఎవరో ఒకరిని తీసుకోవాలని భావిస్తోంది.
ఇక 2014 తర్వాత ఐపీఎల్ మెగావేలం జరగనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే 8 జట్ల ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ జాబితాను విడుదలే చేశాయి. ఈసారి వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఎక్కువ మొత్తంలో ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. కాగా మెగావేలం జనవరి మొదటివారంలో జరిగే అవకాశాలున్నాయి. ఇక మెగావేలం ఇదే చివరిసారి కావొచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022 Mega Auction: ఈ నలుగురు క్రికెటర్లు అమ్ముడుపోవడం కష్టమే!