IPL 2022: ముంబైతో కేకేఆర్‌ ఢీ.. శ్రేయస్‌ సేన ఓడిందా..?

IPL 2022: Knocked Out Mumbai Look To Deliver Final Blow To KKR Playoff Chances - Sakshi

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (మే 9) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బరి నుంచి వైదొలిగిన ముంబై ఇండియన్స్‌.. ఆ దిశగా పయనిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టనుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ పిల్లికి చలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా మారింది. గత 7 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌ల్లో ఓడి ప్లే ఆఫ్స్‌ ఆశలను దాదాపుగా గల్లంతు చేసుకున్న కేకేఆర్‌.. ఇవాల్టి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడగా, వరుసగా 8 పరాజయాల అనంతరం రెండు వరుస విజయాలతో గెలుపు బాట పట్టిన ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా ముంబైకి ఒరిగేదేమీ లేకపోగా.. కేకేఆర్‌ మాత్రం ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. అలా జరగకపోతే ముంబై తర్వాత ప్లే ఆఫ్స్‌ బరి నుంచి తప్పుకున్న రెండో జట్టుగా కేకేఆర్‌ నిలుస్తుంది.

ఇదిలా ఉంటే, ఇవాల్టి మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ పెద్దగా మార్పులేమీ చేసే అవకాశం లేకపోగా కేకేఆర్‌ మాత్రం భారీ మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. ముంబై.. గత మ్యాచ్‌లో టేబుల్‌ టాపర్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను ఖంగుతినిపించిన జట్టునే యధాతథంగా కొనసాగించే అవకాశం ఉండగా, కేకేఆర్‌.. లక్నోపై ఆడిన జట్టులో నాలుగు మార్పులు చేసే అవకాశం ఉంది. ముంబై.. సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే రిలే మెరిడిత్‌పై వేటు వేసే అవకాశం ఉండగా, కేకేఆర్‌.. గత కొన్ని మ్యాచ్‌లుగా విఫలమవుతున్న ఆరోన్‌ ఫించ్‌, బాబా ఇంద్రజిత్‌, అనుకూల్‌ రాయ్‌, హర్షిత్‌ రాణాలను తప్పించి షెల్డన్‌ జాక్సన్‌, సామ్‌ బిల్లింగ్స్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, అమాన్‌ హకీమ్‌ ఖాన్‌లను ఆడించే అవకాశం ఉంది. 

ఇక, పిచ్‌ రిపోర్ట్‌, హెడ్‌ టు హెడ్‌ రికార్డుల విషయానికొస్తే.. డీవై పాటిల్ మైదానం మ్యాచ్‌ ఆరంభంలో బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే క్రీజులో కుదురుకున్న తరువాత బ్యాటర్లకు సహకరించే అవకాశాలు లేకపోలేదు. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోవచ్చు.  ఇరు జట్ల మధ్య హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌ను పరిశీలిస్తే.. కేకేఆర్‌పై ముంబైదే పై చేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 30 మ్యాచ్‌ల్లో ముంబై 22, కేకేఆర్‌ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఇదే సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన ముఖాముఖి పోరులో కేకేఆర్‌ 5 వికెట్ల తేడాతో ముంబైపై  ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కేకేఆర్‌ బ్యాటర్‌ పాట్‌ కమిన్స్‌ 14 బంతుల్లోనే ఐపీఎల్‌ జాయింట్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి నమోదు చేసిన సంగతి తెలిసిందే.  

తుది జట్లు(అంచనా)
కేకేఆర్: రహానే, షెల్డన్‌ జాక్సన్‌, సామ్ బిల్లింగ్స్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, శివమ్ మావి, సునీల్ నరైన్, టీమ్ సౌథీ, అమాన్‌ హకీమ్‌ ఖాన్‌

ముంబై: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్‌ డేవిడ్, డానియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తీకేయ, రిలే మెరిడిత్/ అర్జున్‌ టెండూల్కర్‌
చదవండి: ఐపీఎల్‌ హంగామా నడుస్తున్నా నేనున్నాని గుర్తు చేస్తున్న పుజారా..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top