మూడో టి20లో 8 వికెట్లతో భారత్ జయభేరి
విజయాల ‘హ్యాట్రిక్’తో భారత్కే సిరీస్
ఆడిన మూడూ ఓడిన లంక
రేపు నాలుగో టి20
121/6... 128/9... 112/7... ఇప్పటివరకు జరిగిన మూడు టి20ల్లోనూ శ్రీలంక మహిళల జట్టు స్కోర్లివి... భారత బౌలింగ్ ప్రతాపానికి మచ్చుతునకలు. ప్రతీ మ్యాచ్లోనూ మనమ్మాయిలు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తున్నారు. దీంతో 20 ఓవర్ల కోటా పూర్తి చేసినా... ఆలౌట్ కాకపోయినా కూడా కనీసం 130 పరుగులైనా చేయకుండా శ్రీలంకనుతమ బౌలింగ్ బంధనాలతో కట్టడి చేస్తున్నారు. దీంతో హర్మన్ప్రీత్ బృందం రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను 3–0తో వశం చేసుకుంది.
తిరువనంతపురం: భారత్, శ్రీలంకల మధ్య ఈ వేదికపై ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆడిన తొలి (మూడో టి20) మ్యాచ్తోనే భారత మహిళల జట్టు ఐదు టి20ల సిరీస్ను 3–0తో కైవసం చేసుకుంది. భారత పేసర్ రేణుక సింగ్ (4/21), సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ (3/18) కోలుకోలేని దెబ్బతీయడంతో... మొదట శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులే చేసింది. ఆతిథ్య బౌలింగ్ ధాటికి సింహళ బ్యాటర్లలో ఏ ఒక్కరు కనీసం 30 పరుగులైనా చేయలేకపోయారు.
ఇమిషా దులానీ (32 బంతుల్లో 27; 4 ఫోర్లు) టాప్స్కోరర్! అనంతరం సులువైన లక్ష్యాన్ని హర్మన్ప్రీత్ సేన 13.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (42 బంతుల్లో 79 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో గెలిపించింది. ఆమె దూకుడు వల్లే ఇంకా 6.4 ఓవర్లకు ముందే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. ఇదే వేదికపై రేపు నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది.
షఫాలీ మళ్లీ ధనాధన్ ‘షో’
తొలుత లంక ఇన్నింగ్స్ రేణుక, దీప్తి చావుదెబ్బ తీశారు. దీంతో 45/4 స్కోరు వద్దే ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కోల్పోయింది. హాసిని (25), మిడిలార్డర్లో కవిషా దిల్హరి (20), కౌషిని (19) చేసిన పరుగులతో కష్టంగా జట్టు స్కోరు వంద దాటింది. తర్వాత గత మ్యాచ్ల కంటే తక్కువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టులో షఫాలీ వర్మ మళ్లీ ధనాధన్ షో రెచ్చిపోయింది.
చూడచక్కని బౌండరీలు, భారీ సిక్సర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడింది. 24 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసుకుంది. దీంతో స్మృతి మంధాన (1), జెమీమా (9)లు సింగిల్ డిజిట్లకు అవుటైనా... రవ్వంత ప్రభావం లేకుండానే లక్ష్యంవైపు భారత్ నడించింది. హర్మన్ప్రీత్ (21 నాటౌట్; 2 ఫోర్లు), షఫాలీ అబేధ్యమైన మూడో వికెట్కు 48 పరుగులు జోడించి మ్యాచ్ను ముగించారు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: హాసిని (సి) దీప్తి శర్మ (బి) రేణుక 25; చమరి (సి) హర్మన్ప్రీత్ (బి) దీప్తిశర్మ 3; హర్షిత (సి అండ్ బి) రేణుక 2; ఇమిషా దులానీ (సి) జెమీమా (బి) రేణుక 27; నీలాక్షిక (ఎల్బీడబ్ల్యూ) (బి) రేణుక 4; కవీషా (సి) అమన్జోత్ (బి) దీప్తిశర్మ 20; కౌషని (నాటౌట్) 19; శేషని (బి) దీప్తిశర్మ 5; మాల్కి మదర (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 112. వికెట్ల పతనం: 1–25, 2–31, 3–32, 4–45, 5–85, 6–90, 7–98. బౌలింగ్: రేణుక 4–1–21–4, క్రాంతి 4–0–22–0, దీప్తిశర్మ 4–0– 18–3, వైష్ణవి 3–0–14–0, అమన్జోత్ 4–0– 23–0, శ్రీచరణి 1–0–11–0.
భారత ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (నాటౌట్) 79; స్మృతి (ఎల్బీడబ్ల్యూ) (బి) కవిషా 1; జెమీమా (బి) కవిషా 9; హర్మన్ప్రీత్ (నాటౌట్) 21; ఎక్స్ట్రాలు 5; మొత్తం (13.2 ఓవర్లలో 2 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–27, 2–67. బౌలింగ్: శేహాని 2.2–0–28–0, మాల్కి మదర 2–0–11–0, నిమష మీపగె 2–0–29–0, కవిషా దిల్హరి 3–0–18–2, ఇనోక 4–0–28–0.
151 అంతర్జాతీయ మహిళల టి20ల్లో దీప్తి శర్మ తీసిన వికెట్లు. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మేగన్ షుట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును దీప్తి సమం చేసింది.


