అతడు అత్యద్భుతం.. ఇది ఇండియా కోసం: సూర్య | This is for India: Suryakumar Lauds Ishan And Team Win Over Pakistan | Sakshi
Sakshi News home page

అతడు అత్యద్భుతం.. ఇది ఇండియా కోసం: సూర్య

Feb 16 2026 8:56 AM | Updated on Feb 16 2026 9:32 AM

This is for India: Suryakumar Lauds Ishan And Team Win Over Pakistan

పాకిస్తాన్‌పై టీమిండియా మరోసారి విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఆధిపత్యాన్ని 8-1కు పెంచుకుంది. కొలంబోలో తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయి సల్మాన్‌ బృందం చిత్తు కాగా.. సూర్య సేన టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8 దశకు అర్హత సాధించింది.

ఇది సార్‌ మా బ్రాండ్‌
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav).. దాయాదిపై గెలుపు నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ విజయం ఇండియా కోసం. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడాలని ప్రణాళికలు రచించామో వాటిని పక్కాగా అమలు చేశాము. మా బ్రాండ్‌ను కొనసాగించాము.

అతడు అత్యద్భుతంగా ఆడాడు
ఈ వికెట్‌ మీద తొలుత బ్యాటింగ్‌ చేయడం మంచిదని అనుకున్నాం.  అనుకున్నట్లుగానే టాస్‌ ఓడినా మాకు బ్యాటింగ్‌ చేసే అవకాశమే వచ్చింది. ఇక ఇషాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన, అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఇషాన్‌.. టీమిండియా తరఫునా అదే విధంగా రాణిస్తున్నాడు.

ఈరోజు అతడు అత్యద్భుతంగా ఆడాడు. ఊహించని రీతిలో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. తిలక్‌, రింకూ, శివం కూడా తమ వంతు పాత్ర పోషించారు. ఇక్కడ 175 పరుగులు చేయడం మంచి విషయం. చేయాల్సిన దానికంటే ఇంకో 15-20 పరుగులు ఎక్కువే చేశామనుకుంటున్నాం.

బౌలర్లు సమిష్టిగా రాణించారు
ఇక పవర్‌ ప్లేలో అక్షర్‌ పటేల్‌ బాధ్యత తీసుకున్నాడు. వరుణ్‌, కుల్దీప్‌ కూడా రాణించారు. జట్టులోని ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల సూర్యకుమార్‌ యాదవ్‌ హర్షం వ్యక్తం చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. గ్రూప్‌-ఎలో భాగంగా భారత్‌- పాక్‌ ఆదివారం కొలంబో వేదికగా తలపడ్డాయి. ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో టాస్‌ గెలిచిన పాక్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది.

ఇషాన్‌ విధ్వంసం
ఓపెనర్లలో అభిషేక్‌ శర్మ డకౌట్‌ కాగా.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ మెరుపు అర్ధ శతకం (40 బంతుల్లో 77)తో రాణించాడు. తిలక్‌ వర్మ (25), కెప్టెన్‌ సూర్య (32), శివం దూబే(27) ఫర్వాలేదనిపించారు. ఇక లక్ష్య ఛేదనలో పాక్‌ కేవలం 114 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

భారత బౌలర్లలో స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీయగా.. తిలక్‌ వర్మ, కుల్దీప్‌ యాదవ్‌ తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. పేసర్లలో బుమ్రా, హార్దిక్‌ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్‌ గ్రూప్‌-ఎ నుంచి సూపర్‌-8 చేరిన తొలి జట్టుగా నిలిచింది.

చదవండి: IND vs PAK: తిల‌క్ వ‌ర్మ‌పై గంభీర్ సీరియ‌స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement