ఢాకా: దశాబ్దం తర్వాత భారత్ వేదికగా దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఈ ఏడాది మే 25 నుంచి జూన్ 6వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి గోవా రాష్ట్రం ఆతిథ్యమిస్తుంది. భారత్లో చివరిసారి 2016లో (సిలిగురి, పశ్చిమ బెంగాల్) దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నీని నిర్వహించారు. ఈ టోర్నీకి సంబంధించి గ్రూప్ వివరాలను బుధవారం ఢాకాలోని దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య కార్యాలయంలో విడుదల చేశారు. గ్రూప్ ‘ఎ’లో నేపాల్ (87వ ర్యాంక్), శ్రీలంక (162), భూటాన్ (164)... గ్రూప్ ‘బి’లో భారత్ (69వ ర్యాంక్), బంగ్లాదేశ్ (112), మాల్దీవులు (167) జట్లున్నాయి.
భారత్ తమ లీగ్ మ్యాచ్లను మే 25న మాల్దీవులతో, మే 31న బంగ్లాదేశ్తో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ జూన్ 3న జరుగుతాయి. ఫైనల్ను జూన్ 6న నిర్వహిస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆ జట్టు ఈ టోర్నీలో ఆడటం లేదు. అత్యధికంగా ఐదుసార్లు (2010, 2012, 2014, 2016, 2019) భారత జట్టు దక్షిణాసియా టోర్నీ టైటిల్స్ సాధించింది.


