Ind Vs Sl 1st Test: జడ్డూ భాయ్‌ అద్భుతం.. టీమిండియా ఘన విజయం

Ind Vs Sl 1st Test: India Beat Sri Lanka By An Innings And 222 Runs - Sakshi

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ మీద 222 పరుగుల తేడాతో లంక జట్టును చిత్తు చేసింది. భారత బౌలర్లు అశ్విన్‌, మహ్మద్‌ షమీ, స్టార్‌ ఆల్‌రౌండర్‌ జడేజా చెలరేగడంతో పర్యాటక జట్టుకు ఘోర పరాభవం తప్పలేదు. కాగా మొహాలీ వేదికగా శుక్రవారం టీమిండియా- శ్రీలంక మధ్య మొదటి టెస్టు మ్యాచ్‌ ఆరంభమైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రోహిత్‌ సేన.. రవీంద్ర జడేజా అద్భుత, అజేయ సెంచరీ(175 పరుగులు)తో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఇక బ్యాట్‌తో మెరిసిన జడేజా బంతితోనూ అద్వితీయ ఆట తీరు కనబరచడంతో శ్రీలంక 174 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో ఫాలో ఆన్‌ ఆడిన కరుణరత్నే బృందానికి మూడో రోజు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.

ధనుంజయ డి సిల్వ(30), నిరోషన్‌ డిక్‌వెల్లా(51) మినహా మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. దీంతో 178 పరుగులకే లంక చాప చుట్టేసింది. ఈ నేపథ్యంలో భారీ విజయం టీమిండియా సొంతమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో 175 పరుగులు(నాటౌట్‌) సాధించడంతో పాటుగా.. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఇండియా వర్సెస్‌ శ్రీలంక తొలి టెస్టు స్కోర్లు:
ఇండియా తొలి ఇన్నింగ్స్‌ -  574/8 డిక్లేర్డ్‌
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌- 174 పరుగులు ఆలౌట్‌
శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌-  178 పరుగులు ఆలౌట్‌
ఇన్నింగ్స్‌ మీద 222 పరుగుల తేడాతో భారత్‌ విజయం

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top