రోహిత్‌, శ్రేయస్‌ ఫిఫ్టీలు.. అదరగొట్టిన అక్షర్‌, హర్షిత్‌.. ఆసీస్‌ లక్ష్యం ఎంతంటే? | IND vs AUS 2nd ODI: Rohit Shreyas 50s Axar Harshit Shines Aus Target Is | Sakshi
Sakshi News home page

రోహిత్‌, శ్రేయస్‌ ఫిఫ్టీలు.. అదరగొట్టిన అక్షర్‌, హర్షిత్‌.. ఆసీస్‌ లక్ష్యం ఎంతంటే?

Oct 23 2025 12:56 PM | Updated on Oct 23 2025 1:21 PM

IND vs AUS 2nd ODI: Rohit Shreyas 50s Axar Harshit Shines Aus Target Is

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)తో పాటు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) అర్థ శతకాలతో రాణించగా.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌తో పాటు లోయర్‌ ఆర్డర్‌లో పేస్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా (Harshit Rana) అదరగొట్టారు. 

ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగలిగింది. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాతో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య పెర్త్‌లో తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో ఆడిలైడ్‌లో గురువారం నాటి రెండో వన్డేలోనూ టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది.

గిల్‌, కోహ్లి ఫెయిల్‌
ఓపెనర్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (9)తో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (0)లను వరుస బంతుల్లో ఆసీస్‌ యువ పేసర్‌ జేవియర్‌ బార్ట్‌లెట్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆదిలోనే టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. ఈ నేపథ్యంలో మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, నాలుగో నంబర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు.

రోహిత్‌, శ్రేయస్‌ హాఫ్‌ సెంచరీలు
నెమ్మదిగా, నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నిర్మించారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ 74 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. అయితే, మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో రోహిత్‌  పెవిలియన్‌కు చేరాడు.

వేగంగా ఆడిన అక్షర్‌, హర్షిత్‌
ఇక శ్రేయస్‌ అయ్యర్‌ 77 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు బాది 61 పరుగుల వద్ద.. ఆడం జంపా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఈ క్రమంలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 41 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టిన అక్షర్‌ హాఫ్‌ సెంచరీ (44)కి ఆరు పరుగుల దూరంలో ఉన్న వేళ.. జంపా బౌలింగ్‌లో అవుటయ్యాడు.

ఇతరులలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (11), ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌ (12), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (8) విఫలం కాగా.. టెయిలెండర్‌ హర్షిత్‌ రాణా ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 18 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ 14 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేశాడు.

జంపాకు నాలుగు వికెట్లు
ఈ నేపథ్యంలో తొమ్మిది వికెట్ల నష్టానికి టీమిండియా 264 పరుగులు సాధించి.. ఆసీస్‌కు 265 పరుగుల లక్ష్యం విధించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్‌ ఆడం జంపా అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు బార్ట్‌లెట్‌ మూడు, స్టార్క్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు. 

చదవండి: డకౌట్‌ తర్వాత కోహ్లి చర్య వైరల్‌.. గుడ్‌బై చెప్పేశాడా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement